గత పుష్కర రికార్డు బద్దలైంది..

22 Jul, 2015 11:20 IST|Sakshi

భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి మహాపుష్కరాల సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఎనిమిది రోజుల్లో పుణ్యస్నానమాచరించిన భక్తుల సంఖ్య 30.18 లక్షలకు చేరింది. 2003 పుష్కరాలకు హాజరైన భక్తుల సంఖ్య(30లక్షలు)ను వారంలోనే దాటేసింది. ఇప్పటివరకు భద్రాచలంలో పుణ్యస్నానమాచరించిన భక్తుల సంఖ్య 22 లక్షలకు చేరింది. శని, ఆది, సోమవారాల్లో 13 లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు చేయడం గమనార్హం. మిగతా ఏడు ఘాట్లకు భక్తుల తాకిడి ఉంది. మిగిలిన నాలుగు రోజుల్లో 20 లక్షల మంది వరకు భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. మంగళవారం 4.62 లక్షల మంది పుష్కరస్నానమాచరిస్తే భద్రాచలంలోనే 2.5 లక్షలకుపైగా పుణ్యస్నానం చేశారు. మధ్యాహ్నం నుంచి రామయ్య ఆలయంలో ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. డీజీపీ అనురాగ్‌శర్మ, ఇంటిలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, ఐజీ నవీన్‌చంద్ పర్ణశాలలో పర్యటించారు.
 
కరీంనగర్ 11.32 లక్షలు
జిల్లాలో సోమవారం 11.32 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. కాళేశ్వరంలో 4.25 లక్షల మంది, ధర్మపురిలో 3.75 లక్షల మంది, మంథని, కోటిలింగాల ఘాట్ల వద్ద 90 వేల మంది చొప్పున భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. గోదావరిఖనిలో పుష్కర స్నానానికి వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా ఇందారం గ్రామానికి చెందిన సుంకె ప్రసాద్ (26) అనే యువకుడు గల్లంతయ్యాడు. ధర్మపురిలో జనసందోహం కాస్త తగ్గింది. గంటలోపే లక్ష్మీనరసింహస్వామి దర్శనం లభించింది.
 
నిజామాబాద్ 6.96 లక్షలు
నిజామాబాద్ జిల్లాలోనూ భక్తుల రద్దీ తగ్గింది. అరుుతే హైదరాబాద్-నిజామాబాద్ రహదారి వెంట భక్తుల సందడి కన్పించింది. జిల్లాలో సోమవారం 6.96 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. కందకుర్తిలో 2.18 లక్షలు, పోచంపాడ్ ఘాట్ వద్ద 2.08 లక్షలు, తడపాకల్ ఘాట్ వద్ద 98 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు.
 
ఆదిలాబాద్ 6.19 లక్షలు
ఆదిలాబాద్ జిల్లాలో పుష్కర భక్తుల సందడి కాస్త తగ్గింది. జిల్లాలో సోమవారం 6.19 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. బాసర క్షేత్రంలోని ఘాట్ వద్ద 1.5 లక్షల మంది, సోన్ వద్ద 1.4 లక్షల మంది, మంచిర్యాలలో 76 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. అనంతరం ఆలయూల్లో పూజలు చేశారు. 2 గంటల్లో బాసర సరస్వతి అమ్మవారి దర్శనం లభించింది.

>
మరిన్ని వార్తలు