దళారుల్లో దడ..

1 Apr, 2017 18:49 IST|Sakshi
► చండూరు కొనుగోలు కేంద్రంలో కందులు విక్రయించిన
    దళారులకు బిగుస్తున్న ఉచ్చు
► ఇటు రెవెన్యూ.. అటు విజిలెన్స్‌ శాఖలు సమన్వయంతో ముందుకు..
► 20 క్వింటాళ్ల పైబడి అమ్మిన వారి వివరాలు సేకరించే
    పనిలో అధికార యంత్రాంగం
► ఇప్పటికే జిల్లాలోని తహసీల్దార్లకు వెళ్లిన మెయిల్‌  
 
చండూరు: చండూరు వ్యవసాయ మార్కెట్‌లో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో కందులు విక్రయించిన దళారులకు ఉచ్చు బిగుస్తోంది. మరో వారంలో దళారులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు అటు రెవెన్యూ.. ఇటూ విజిలెన్స్‌.. రెండు శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.  కొద్దిరోజుల క్రితం జేసీ నారాయణరెడ్డి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసినప్పుడు దళారుల లిస్టు తయారు చేసి తనకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా గత శుక్రవారం విజిలెన్స్‌ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో ఓ బృందం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన విషయం తెలిసిందే.

ఈ కొనుగోలు కేంద్రంలో 20 క్వింటాళ్లకు పైగా విక్రయించిన వారి వివరాలను స్థానిక తహసీల్దార్‌కు అందించాలని ఆయన మార్కెట్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్‌లో జరిగిన తతంగంపై రైతుల çనుంచి సమాచారం తీసుకున్నారు. కేంద్రంలో ఏ మండలం నుంచి ఎంత మంది 20 క్వింటాళ్లకు పైగా  విక్రయించారో వివరాలతో కూడిన సమాచారాన్ని ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లకు చండూరు తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి మెయిల్‌ పంపిం చారు. కందులు విక్రయిం చిన రైతులకు భూమి ఉందా.. ఉంటే కందులు పండించారా.. ఎంత పంట పండింది.. అనే కోణంలో విచారించి కలెక్టర్‌కు నివేదిక అందించనున్నారు. 
 
147 మంది  సమాచారం కోసం..
 
ఈ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 37,559 క్వింటాళ్ల కందులను 4505 మంది రైతుల ద్వారా కొనుగోలు జరిపారు. ఇందులో 158 మంది 20 క్వింటాళ్లకు పైగా విక్రయించినవారున్నారు. ఇందులో చండూరు మండలానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. 11 మందిలో కస్తాల గ్రామానికి చెందిన ఓ వ్యాపారి, భార్యతో కలిసి భూమి లేకుండానే కందులను అమ్మినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. మిగిలిన 147 మంది దళారుల సమాచారం కోసం రెవెన్యూ సిబ్బంది వేట సాగిస్తోంది. కందుల కొనుగోలు కేంద్రాన్ని చండూరు మార్కెట్‌లో జనవరి 23 తేదీన హాకా ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఫిబ్రవరి 23 వరకు 1994 మంది రైతులకు రూ.8 కోట్ల పైచిలుకు బకాయిలు చెల్లించారు. ఇంకా రూ.5.2 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. 
>
మరిన్ని వార్తలు