మహిళలకు మీరే భద్రత

1 Mar, 2017 13:12 IST|Sakshi
► మహిళలకు మీరే భద్రత
► వారికి భరోసా కల్పించేలా విధులు నిర్వర్థించాలి
► ఈవ్‌టీజింగ్‌ను రూపుమాపాలి
► లింగ వివక్ష లేని సమాజం నిర్మిద్దాం
► డీఐజీ అకున్‌ సబర్వాల్‌
మహబూబ్‌నగర్‌ క్రైం : ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు భద్రత లేకుండా పోయింది.. ఇంకా మహిళ బస్సులో ఒంటరిగా ప్రయాణించడానికి  భయపడుతోంది. మీకు మేమున్నాం అంటూ భరోసా కల్పించాల్సిన బాధ్యత మన పోలీస్‌శాఖదే.. అని హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ అకున్‌ సబర్వాల్‌ అన్నారు. పోలీస్‌ శాఖ, పీపుల్‌ ఫర్‌ పారిటి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మహిళల రక్షణ  అనే అంశంపై మూడురోజులపాటు నిర్వహించే వర్క్‌షాప్‌నను డీఐజీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట పోలీస్‌ అతిథిగృహంలో ఎస్పీ రెమారాజేశ్వరి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి చేరుకోగా సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
 
అనంతరం నిర్వహించిన సమావేశంలో డీఐజీ సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సుమారు 480 అత్యాచార కేసులను పరిశీలిస్తే సమాజంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఇతర దేశాల్లో ఎక్కడాలేని విధంగా ఇక్కడి మహిళలు ఈవ్‌టీజింగ్‌ బారిన పడుతున్నారని, ఇలాంటి ఘటనలకు ఇక నాంది పలకలన్నారు. లింగ వివక్ష లేని సమాజ నిర్మాణానికై పోలీస్‌శాఖ ప్రధాన భూమిక పోషించాలని ఆదేశించారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, దాడుల గురించి క్లుప్తంగా తెలుసుకుని వాటిని అరికట్టాడానికి మీవంతుగా కృషి చేయాలని సూచించారు. ఈ వర్క్‌షాప్‌ మహబూబ్‌నగర్‌లో విజయవంతమైతే రాష్ట్రంలో అన్ని సబ్‌ డివిజన్‌లలో ప్రారంభిస్తామన్నారు. 
గ్రామీణపోలీస్‌ వ్యవస్థ బలపడాలి : ఎస్పీ రమారాజేశ్వరి
జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంచుకోవడం శుభ పరిణామమని, శిక్షణ ఇక్కడ విజయవంతం చేసి మహిళల్లో మార్పు తీసుకరావడానికి కృషి చేయాలని కోరారు. గ్రామీణ పోలీస్‌ అధికారి వ్యవస్థను బలోపేతం చేస్తే నేరాలను అదుపు చేయడం సులభమన్నారు. అనంతరం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు ఆధిత్య గుప్తా, మనీషాలు మహిళలపై జరుగుతున్న దాడులు, నివారణపై వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు గిరిబాబు, గంగాధర్, రామకృష్ణ, డివిపిరాజు, వై.రామకృష్ణ పాల్గొన్నారు.
మొక్కలు నాటిన డీఐజీ
మధ్యాహ్నం జిల్లాకేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను డీఐజీ అకున్‌ సబర్వాల్‌ విజిట్‌ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణంలో మొక్కలు నాటారు.  పలు రకాల ఫైల్స్, పెండింగ్‌ కేసులను పరిశీలించారు. స్టేషన్‌ పరిసరాలు శుభ్రంగా ఉండటంతో సీఐ సీతయ్యను డీఐజీ అభినందిచారు.
మరిన్ని వార్తలు