వారిని ప్రమోట్‌ చేసేద్దామా! 

19 Jun, 2020 06:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులను పరీక్షల్లేకుండానే ప్రమోట్‌ చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,   సీఎస్‌ సోమేశ్‌ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ, సాంకేతిక విద్య, కళాశాల విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, వివిధ వర్సిటీల ఇన్‌ఛార్జి వీసీలు జయేశ్‌ రంజన్, అరవింద్‌కుమార్, జనార్దన్‌రెడ్డి తదితరులతో  సమావేశం గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. డిగ్రీ, పీజీ (ఇంజనీరింగ్‌ సహా) ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలను ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నిర్వహించాలా? వద్దా? అనే దానిపై చర్చించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ కష్టమనే భావన వ్యక్తమైనట్లు తెలిసింది.(ఇంటర్‌ ఫలితాలు బాలికలే టాప్‌)

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ వల్ల మరిన్ని సమస్యలు వస్తాయనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఒక్కో పరీక్ష కేంద్రానికి వందల మంది విద్యా ర్థులు రావడం, ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు చేతులు మారడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు పరీక్షలు నిర్వహించకుండా ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా, లేదా కిందటి సెమిస్టర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా పాస్‌చేస్తే ఎలా ఉంటుందనే దానిపైనా చర్చించారు. మొత్తానికి పరీక్షలను రద్దుచేసి, ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగానే ప్రమోట్‌ చేయాలనే అభిప్రాయాన్ని ఎక్కువ మం ది అధికారులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో చివరకు పరీక్ష ల రద్దుకు సమావేశం మొగ్గు చూపినట్లు సమాచారం. 

సీఎంకు నివేదిక.. ఆపై నిర్ణయం 
పరీక్షలు నిర్వహిస్తే లేదా నిర్వహించకపోతే తలెత్తే సమస్యలపై సమగ్ర నివేదికను రూపొందించి సీఎం కేసీఆర్‌కు అందజేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. దానిపై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారనే భావనకు ఉన్నతాధికారులు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు రద్దుచేస్తే ఏ ప్రాతిపదికన విద్యార్థులను ప్రమోట్‌ చేయాలి?, మార్కులెలా ఇవ్వాలనే మార్గదర్శకాలను నివేదికలో పొందుపరచాలని నిర్ణయించారు. ఇప్ప టికే డిటెన్షన్‌ను ఎత్తివేసి, ప్రమోట్‌ చేసి నందున పరీక్షల సంగతి తరువాత చూసుకోవచ్చని, ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థుల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీఎంకు విన్నవించాలని నిర్ణ యించినట్లు తెలిసింది. ఫైనల్‌ సెమిస్టర్‌ లో ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను చేసినా, ఆయా విద్యార్థులకు సంబంధించిన బ్యాక్‌లాగ్స్‌ విషయంపైనా చర్చించారు.  

మరిన్ని వార్తలు