కడుపుకోత...

23 Jun, 2014 03:59 IST|Sakshi
కడుపుకోత...

బియాస్ నదిలో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం
 - మిన్నంటిన తల్లిదండ్రుల రోదన
 - వరంగల్ గిర్మాజీపేట, నర్సంపేటలో విషాదఛాయలు
 - నేడు హైదరాబాద్‌కు మృతదేహాలు
 - జిల్లాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు

 ప్రమాదం నుంచి తప్పించుకుని బతికి ఉంటారనే ఆశతో ఉన్న ఆ తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది.  14 రోజుల నుంచి కుమారుల రాక కోసం ఎదురుచూస్తున్న వారికి కడుపుకోతే మిగిలింది. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియూస్ నదిలో గల్లంతైన నర్సంపేటకు చెందిన చిందం పరమేశ్వర్, వరంగల్ నగరంలోని 21వ డివిజన్ గిర్మాజీపేటకు చెందిన అఖిల్ మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యూరుు. విద్యార్థులు కానరాని లోకాలకు పోయారని టీవీల ద్వారా తెలుసుకున్న వారి కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి.    
 
కడుపుకోత మిగిల్చి.. కానరాని లోకాలకు..
 
- బియాస్ నదిలో లభ్యమైన పరమేశ్వర్, అఖిల్ మృతదేహాలు
- శోకసంద్రంలో  కుటుంబ సభ్యులు
- గిర్మాజీపేట, నర్సంపేటలో విషాద ఛాయలు

ఆ తల్లిదండ్రులు ఏది జరగకూడదని అనుకున్నారో.. అదే జరిగింది. ఎక్కడో ఒకచోట తమ కుమారులు బతికి ఉండే ఉంటారని.. క్షేమంగా రావాలని వారు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. నవ్వుతూ ఇంట్లో నుంచి వెళ్లిన విద్యార్థులు విగతజీవులుగా బియాస్ నదిలో లభ్యమయ్యారు. కన్నవారికి తీరని కడుపు కోత మిగిల్చి వెళ్లారు. నర్సంపేటకు చెందిన పరమేశ్వర్, గిర్మాజీపేటకు చెందిన అఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయని పిడుగులాంటి వార్త తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు ఒక్కసారిగా బోరున విలపించారు.
 
అయ్యో కన్నా.. అఖిల్
వరంగల్ చౌరస్తా : వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి సంజయ్, సునీత దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు మౌనిక హన్మకొండలోని అల్లూరి ఇనిస్టిట్యూట్‌లో ఎంబీఏ చేస్తుండగా, అఖిల్(23) హైదరాబాద్ శివారు బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్(ఈఐఈ) రెండో సంవత్సరం చదువుతున్నాడు. 1995 జూన్ 12న పుట్టిన అఖిల్ ఈనెల 3న ఇండస్ట్రీయల్ టూర్‌లో భాగంగా తోటి  విద్యార్థులతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లాడు. ఈనెల 8న సాయంత్రం అక్కడి బియాస్ నదిలో గల్లంతయ్యాడు. ఆ రోజు నుంచి అతడి రాక కోసం కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు.
 
నాలుగు గంటల మిస్టరీ

బియాస్ నదిలో గాలిస్తున్న రెస్క్యూటీమ్‌కు ఆదివారం ఒక్కరోజే నాలుగు మృతదేహాలు లభించాయి. మృతుల్లో ఒకరు నర్సంపేటకు చెందిన పరమేశ్వర్‌గా, మరో ఇద్దరు హైదరాబాద్, ఖమ్మం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. సాయంత్రం కనుగొన్న విద్యార్థి మృతదేహం ఏ మాత్రం  గుర్తుపట్టలేని విధంగా మారింది. మృతదేహం ఎవరిదనే సందేహాలు వెలువడ్డాయి.

దీంతో అక్కడ గాలింపు చర్యల్లో నిమిగ్నమైన రాష్ట్రానికి చెందిన అదనపు డీజీపీ రాజీవ్ త్రివేది అఖిల్ పెద్దనాన్న సంజీవరావు, అక్క మౌనికతో ఫోన్‌లో మాట్లాడారు. అఖిల్ ఒంటిపై ఉన్న గుర్తులు, దుస్తులు, ఇతర వివరాల కోసం ఆరా తీశారు. అఖిల్ చేతి మణికట్టుకు ఉన్న దీపావళి  కేదారి వ్రతం, ఆంజనేయ స్వామి దారాలతో గుర్తించగలిగారు. చివరికి ఈ చేదువార్తను రాత్రి 7.55 గంటలకు అఖిల్ కుటుంబ సభ్యులకు తెలిపారు.
 
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

కొడుకు కోసం పదిహేను రోజులుగా ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలు బాదుకుంటూ బోరున విలపించారు. సమాచారం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు అతడి స్వగృహానికి చేరుకున్నారు.

అఖిల్ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి అఖిల్ మృతదేహం హైదరాబాద్‌కు చేరుకునే అవకాశాలున్నట్లు బంధువులు తెలిపారు. కాగా జిల్లా యంత్రాంగం నుంచి అఖిల్ కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు.
 

పరమేశా.. అప్పుడే నా కొడుకును తీసుకెళ్లావా..
 
నర్సంపేట : ఓ పరమేశా.. నీ పేరు పెట్టుకుంటే నా కొడుకు నిండు నూరేళ్లు జీవిస్తాడనుకున్నా.. ప్రమాదం జరిగి 14 రోజులైనా నా కొడుకు బతికి వస్తాడనుకున్నా.. నీ పేరు పెట్టుకున్న కొడుకును నీ వద్దకే తీసుకెళ్లి నాకు కడుపుకోత మిగిల్చావా తండ్రీ.. అన్ని దేవతలకూ మొక్కుకున్నా ఏ దేవునికీ నా మొరముట్టలేదా నాయనా.. మమ్మీ టాటా అని చెప్పుకుంటూ పోతివి కదరా కొడుకా.. అంటూ హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన చిందం పరమేశ్వర్ తల్లి ఉమ రోదనలు మిన్నుముట్టాయి.

పరమేశ్వర్ మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైన విషయం టీవీ వార్తల్లో వస్తుండగా చూసి కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. నర్సంపేట పట్టణానికి చెందిన చిందం వీరన్న-ఉమల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరిలో చిన్నవాడు పరమేశ్వర్(24) బియాస్ నదిలో గల్లంతైన విషయం విధితమే.

ప్రమాదం జరిగిన నాటి నుంచి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు పరమేశ్వర్ క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ మొక్కని దేవుడు లేడు. ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడని భావించారు. చివరికి వారి ఆశలు నిరాశలయ్యాయి. మృతదేహం లభించిన విషయంతో తెలియడంతో చుట్టుపక్కల ప్రజలు పరమేశ్వర్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
 
నేడు మృతదేహం తరలింపు

పరమేశ్వర్ మృతదేహం బియాస్ నదిలో గల్లంతైన ప్రదేశం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. మండీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని సోమవారం ఉదయం 6.30 గంట లకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు.. అక్క డి నుంచి నర్సంపేట తహసీల్దార్ సూర్యనారాయణ, ఆర్‌ఐ రాజు నర్సంపేటకు తీసుకురానున్నట్లు ఆర్డీఓ అరుణకుమారి తెలిపారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.  
 
నేలరాలిన సరస్వతీ పుత్రుడు


పరమేశ్వర్ చిన్ననాటి నుంచీ చదువులో ముందుండేవాడని, పాలిటెక్నిక్ కోర్సు చేస్తుండగానే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం కాల్‌లెటర్ వచ్చినా ఉన్నత స్థాయికి చేరోకోవాలనే లక్ష్యంతో ఆ అవకాశాన్ని వదులుకున్నాడని అతని సోదరుడు ప్రశాంత్ తెలిపాడు. పరమేశ్వర్ 1 నుంచి 5వ తరగతి వరకు పట్టణంలోని అరవింద పాఠశాల, 6 నుంచి 7 వరకు గీతాంజలి స్కూల్, 8 నుంచి టెన్త్ వరకు మహబూబాబాద్‌లోని మహర్షి పాఠశాలలో చదువుకున్నాడు.

టెన్త్‌లో 500 పైచీలుకు మార్కులు సాధించాడు. తర్వాత హైదరాబాద్ ఈస్టు మారేడుపల్లి పాలిటెక్నిక్‌లో మూడున్నర సంవత్సరాలు అభ్యసించా డు. ఈ క్రమంలో థౌసెండ్ మిలియన్ కంపెనీలో ఉద్యోగ అవకాశం వచ్చినా వదులుకుని ఈసెట్ కోచింగ్‌కు వెళ్లి రాష్ట్రం లో 8వ ర్యాంక్ సాధించాడు. వీఎన్‌ఆర్ కళాశాలలో ఇన్సుమెంటేషన్ గ్రూపులో సీటు రావడంతో రెండేళ్లు పూర్తి చేశాడు.

మరిన్ని వార్తలు