ఇంకెన్నాళ్లీ వివక్ష..?

11 Mar, 2018 03:45 IST|Sakshi

మహిళల పట్ల చిన్నచూపు మారడం లేదు:: శాంతాసిన్హా

సరైన చట్టాలు రావాలి.. ప్రతి మహిళా చదువుకునేలా ఏర్పాటు చేయాలి

సాక్షి, హైదరాబాద్ ‌: అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగడం బాధాకరమని మెగసెసె అవార్డు గ్రహీత, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ఉద్యమకారిణి ప్రొఫెసర్‌ శాంతాసిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో టీపీసీసీ మహిళా విభాగం ఆ«ధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మహిళలకు పురుషులతో సమానమైన హక్కులు, అవకాశాలు లభించడం లేదు. ఆర్థిక, విద్యారంగాల్లో పురోగతితోనే సరైన సమానత్వం వస్తుంది, అందుకు మహిళలు విద్యావంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయటికి పంపితే అత్యాచారాలు జరుగుతాయనే అనుమానంతో చదువుకు దూరం చేసి, చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నారు. దీని కోసం చట్టాల్లో మార్పులు రావాలి.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి తగిన చట్టాలు వచ్చాయని’ అన్నారు. టీపీసీసీ మహిళావిభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే మహిళలను గౌరవిస్తుందని, మిగతా పార్టీలలో వారి పట్ల చిన్న చూపు ఉందన్నారు. టీఆర్‌ఎస్‌లో మహిళలకు గౌరవం, అవకాశం లేవని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు