దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్‌: విచార‌ణ ఆల‌స్యం

17 Jul, 2020 16:56 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన 'దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్‌'పై సుప్రీంకోర్టు నియ‌మించిన జ్యుడీషియ‌ల్ క‌మిటీ విచార‌ణ‌కు కరోనా అడ్డంకిగా మారింది. కోవిడ్ కార‌ణంగా విచార‌ణ‌లో జాప్యం జ‌రుగుతోంద‌ని శుక్ర‌వారం సుప్రీంకోర్టు క‌మిష‌న్ పేర్కొంది. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు 1365 మంది అఫిడ‌విట్‌ల‌ను స‌మర్పించామ‌ని తెలిపింది. ఈ క‌మిష‌న్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 3న హైద‌రాబాద్‌కు చేరుకుని స‌మావేశ‌మైంది. ఆ స‌మ‌యంలో నిందితుల పోస్టుమార్టం రీ పోస్టుమార్టం రిపోర్ట్‌ను కూడా పరిశీలించింది. ఆ త‌ర్వాత దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై మ‌రిన్ని వివ‌రాలు సేక‌రించింది. ఎన్‌హెచ్ఆర్‌సీ నివేదిక‌తో పాటు ఎన్‌కౌంట‌ర్‌పై తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు సంస్థ (సిట్) నివేదిక‌ను ప‌రిశీలించింది. మార్చి చివ‌రి వారంలో రెండో ద‌ఫా స‌మావేశం కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది. అయితే ఈ కేసులో ఆన్‌లైన్‌లో విచార‌ణ చేప‌ట్టేందుకు అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేసింది. (‘దిశ’ ఘటనను ఉద్వేగ భరితంగా మలుస్తా: వర్మ)

‌డిసెంబ‌ర్ 6న నిందితుల‌ ఎన్‌కౌంట‌ర్‌‌
రంగారెడ్డిలోని షాద్‌న‌గ‌ర్ స‌మీపంలో చ‌టాన్‌ప‌ల్లి బ్రిడ్జి ద‌గ్గ‌ర గ‌తేడాది న‌వంబ‌ర్ 27న వెట‌ర్నరీ వైద్యురాలిని అత్యాచారం చేసి, పెట్రోల్‌ పోసి త‌గుల‌బెట్టారు. ఈ కేసులో న‌లుగురు నిందితులు మహమ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబ‌ర్ 6వ తేదీన సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండ‌గా నిందితులు పారిపోతుండటంతో వారిని ఎన్‌కౌంట‌ర్ చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. అయితే ఇది బూట‌క‌పు ఎన్‌కౌంటర్‌ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థాణంలో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. (దిశ: హైదరాబాద్‌కు చేరుకున్న జ్యుడీషియల్‌ కమిటీ)

మరిన్ని వార్తలు