డిస్పెన్సరీ తరలింపు తప్పదా?

2 Jun, 2017 01:36 IST|Sakshi

జగిత్యాల: నిత్యం 40–50 మంది ఆస్పత్రికి రోగులు వస్తుంటారు. దీంతోపాటు ఈ డిస్పెన్సరీ కింద పలు గ్రామాల్లో మోతె, ధరూర్, చల్‌గల్, అంతర్గాం, తాటిపల్లి, జాబితాపూర్‌ గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలందిస్తుంటారు. ఎస్సారెస్పీ ఏర్పడ్డప్పుడు వారి ఆధ్వర్యంలో ధరూర్‌ క్యాంప్‌లోని ఇరిగేషన్‌ కార్యాలయ సమీపంలో ప్రభుత్వ సివిల్‌ డిస్పెన్సరీ ఏర్పాటు చేశారు. దీనిని ఇటీవలే పీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రస్తుతం ఇరిగేషన్‌ కార్యాలయ సమీపంలోనే నూతనంగా నర్సింగ్‌ కళాశాలను నిర్మిస్తున్నారు. అయితే పురాతన భవనం కావడంతో దానిని కూల్చివేస్తామని ఆదేశాలు జారీ చేయగా వారు ఇటీవలే ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌కు ప్రభుత్వ సివిల్‌ డిస్పెన్సరీని తరలించారు.

ఇంత వరకు బాగానే ఉన్నా ఐదు కిలోమీటర్ల దూరంలోని టీఆర్‌నగర్‌కు తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్‌హౌస్‌ భవనమే సరిపోవడం లేదని టీఆర్‌నగర్‌లో వసతి సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్పత్రి కింద ప్రతీసారి ఇమ్యూనైజేషన్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ భవనంలోనే సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవుతుంటే మళ్లీ దీనిని టీఆర్‌నగర్‌కు తరలించడం సమంజసంకాదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ డిస్పెన్సరీ పరిధిలో...
ప్రస్తుతం క్యాంప్‌లోని ఎస్సీ, ఎస్టీ హాస్టల్, కస్తూర్బా విద్యార్థులకు వైద్యం అందిస్తుంటారు. దీంతోపాటు మోతె పరిధిలోని మోతె, గోవిందుపల్లి, వెల్దుర్తి, గొల్లపల్లి, బావోజీపల్లి, ధరూర్‌ పరిధిలో ధరూర్, టీఆర్‌నగర్, నర్సింగాపూర్, వంజరిపల్లి, ఎల్లాలపల్లి, అంతర్గాం పరిధిలో అంతర్గాం, హస్నాబాద్, అంబారిపేట, లింగంపేట, చల్‌గల్‌ పరిధిలో చల్‌గల్, మోరపల్లి, తాటిపల్లి పరిధిలో తాటిపల్లి, మోరపల్లి, జాబితాపూర్‌ పరిధిలో జాబితాపూర్, తిమ్మాపూర్, రఘురాములకోటకు చెందిన ప్రజలు వైద్యం పొందుతారు.

మౌలిక వసతులు కరువు
ప్రస్తుతం ఈ భవనంలోనే కరెంట్, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మందులకు ఇంజక్షన్లకు తప్పకుండా ఫ్రిజ్‌ అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో రెండు ఫ్రిజ్‌లు ఉండగా టీఆర్‌నగర్‌లోని గదిలో పట్టే అవకాశం లేదు.

మరిన్ని వార్తలు