విద్యుత్‌ ఉద్యోగుల విభజనలో ముందడుగు

4 Nov, 2017 01:30 IST|Sakshi

 పక్కన పెట్టిన ఉద్యోగుల్లో ఎవరు, ఎక్కడ ఉంటారో తెలుసుకోండి

రెండు వారాల్లో ఆప్షన్లు తీసుకుని ఏపీకి అందజేయండి

తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల విభజన విషయంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు హైకోర్టు చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది. విభజన నేపథ్యంలో స్థానికత ఆధారంగా పక్కన పెట్టిన దాదాపు 1,200 మంది ఉద్యోగుల్లో ఎంత మంది ఏపీకి వెళ్లాలనుకుంటున్నారో, ఎంత మంది తెలంగాణలో ఉండదలిచారో తెలుసుకోవాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

‘ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సదరు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలి. రెండు వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి, ఆ వివరాలను ఏపీకి తెలియ జేయాలి. వాటిని ఏపీ పరిశీలించి మరో రెండు వారాల్లో ఓ అభిప్రాయానికి రావాలి’ అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ ఎం.ఎస్‌.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోండి
పాత విషయాలను పక్కన పెట్టి ఇరుపక్షాలు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఉద్యోగుల విభజన నిమిత్తం తెలంగాణ విద్యుత్‌ సంస్థలు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ 1,260 మందికి పైగా విద్యుత్‌ ఉద్యో గులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఏపీ స్థానికత ఆధారంగా రిలీవ్‌ చేసిన ఉద్యోగుల జీత భత్యాలను 58:42 నిష్పత్తిలో ఉభయ రాష్ట్రాలు చెల్లించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు తుది విచారణను వాయిదా వేసింది. అంతకుముందు కూడా వివాద పరిష్కారాని కి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ధర్మాధి కారిని ఏర్పాటు చేసినా సమస్య కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగుల వ్యాజ్యాలపై హైకోర్టు తుది విచారణ ప్రారంభించి.. సామరస్యపూర్వక పరిష్కార ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వివాద పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తెలుసుకోవడం అవసరమని, తెలం గాణకు ఆప్షన్‌ ఇచ్చిన వారిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుం టూ.. తెలంగాణ ప్రభుత్వం రెండు అడుగు లు తగ్గిందని, అందువల్ల సమస్య పరిష్కా రానికి మీరు (ఏపీ ప్రభుత్వం) చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్‌కు సూచిం చింది.

విద్యుత్‌ పంపిణీ సంస్థలు స్వతంత్ర సంస్థలని, వాటికి ప్రాంతీయతను ఆపాదిం చడానికి వీల్లేదని రమేశ్‌ తెలిపారు. స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టిన ఉద్యోగులందరూ తెలంగాణ ఉద్యోగు లేనని స్పష్టం చేశారు. వారికి ఏపీలో ఎలాంటి పోస్టులు లేవన్నారు. విద్యుత్‌ పంపిణీ సంస్థల వారీగా సంప్రదింపులు జరిపితే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు

ఆప్షన్లు తెలుసుకుంటేనే స్పష్టత
ఈ సమయంలో ధర్మాసనం కల్పించుకుని, ఆప్షన్లు తెలుసుకుంటే ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టత వస్తుందని సూచన చేసింది. కోర్టుకొచ్చిన వారిలో ఎంత మంది తెలంగాణలో ఉండదలిచారో.. ఎంత మంది ఏపీకి వెళ్లదలిచారో తెలుసుకుని ఎందుకు చెప్పకూడదని ప్రశ్నించింది. ఇలా చేస్తే సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలిపింది.

తాను దాదాపు 500 మంది తరఫున హాజరవుతున్నానని, వారిలో 40 శాతం తెలంగాణకు, మిగిలిన వారు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే అవకాశం ఉందని సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ చెప్పారు. ఈ సమయంలో ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, ఆప్షన్లు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, నిర్దిష్ట నమూనా తయారు చేసి ఆప్షన్లు తెలుసుకుంటామని తెలిపారు. ఈ ప్రతిపాదనను స్వాగతించిన ధర్మాసనం, రెండు వారాల్లో ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.

మరిన్ని వార్తలు