పేదింట డాక్టర్‌..!

6 Aug, 2018 10:37 IST|Sakshi
సాదిక్‌ను అభినందిస్తున్న తల్లిదండ్రులు  

కొణిజర్ల : ఆ విద్యార్థి పేరు సాదిక్‌. తండ్రి ఓ సామాన్య ఆర్‌ఎంపీ వైద్యుడు. అష్టకష్టాలు పడి పిల్లలను చదివించాడు. తండ్రిలానే తానూ వైద్యుడినై నిరుపేదలకు సేవ చేయాలని చిన్నతనంలోనే అనుకున్నాడు. దానిని నిజం చేసుకోబోతున్నాడు. ఆ ప్రయత్నంలో మొదటి మెట్టు ఎక్కేశాడు. నీట్‌ పరీక్షలో మంచి ర్యాంక్‌ సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్‌ సీటు సాధించాడు. 
కొణిజర్లకు చెందిన షేక్‌ సలీమ్, ఫాతిమా దంపతుల కుమారుడు షేక్‌ సాదిక్‌.

ఈ ఏడాది నీట్‌ ఫలితాలలో ఆలిండియా స్థాయిలో 11,889వ ర్యాంక్‌ సాధించాడు. హైదరాబాద్‌లోని దక్కన్‌ మెడికల్‌ కళాశాలలో సీటు పొందాడు. ఇతడు చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. 5వ తరగతి వరకు గోర్కి పబ్లిక్‌ స్కూల్‌లో, ఖమ్మంలోని మరో ప్రయివేట్‌ స్కూల్‌లో పదోతరగతి వరకు చదివాడు. పదోతరగతిలో 10 జీపిఏ సాధించాడు. ఖమ్మంలోని ప్రయివేట్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివాడు.

979 మార్కులు సాధించాడు. టీఎస్‌ ఎంసెట్‌లో 1089వ, ఏపీ ఎంసెట్‌లో 3850వ  ర్యాంక్‌ పొందాడు. నీట్‌లో ఆలిండియా కేటగిరీలో 11,889వ ర్యాంక్, లోకల్‌లో 1363వ ర్యాంక్‌ సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే హైదరాబాద్‌లోని దక్కన్‌ మెడికల్‌ కళాశాలలో సీటు లభించింది. నీట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఎటువంటి లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకోలేదు. తమ బిడ్డడి విజయంతో ఆ తల్లిదండ్రులు సంతోషంతో పొంగిపోతున్నారు. 

న్యూరాలజిస్ట్‌ కావాలనుంది 

ఎంబీబీఎస్‌ పూర్తయిన తర్వాత న్యూరాలజీ స్పెషలైజేషన్‌తో పీజీ చేస్తానని అంటున్నాడు సాదిక్‌. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని అన్నాడు.

 

మరిన్ని వార్తలు