దోమకొండ సంస్థాన వారసుడు ఉమాపతిరావు కన్నుమూత

28 May, 2020 05:24 IST|Sakshi

నేడు దోమకొండలో అంత్యక్రియలు 

దోమకొండ/ సాక్షి, హైదరాబాద్‌: కామారెడ్డి జిల్లాలోని దోమకొండ సంస్థాన వారసుడు, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి కామినేని ఉమాపతిరావు (92) బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రముఖ సినీ హీరో రామ్‌చరణ్‌ భార్య ఉపాసన, ఉమాపతిరావు మనుమరాలు. ఉమాపతిరావు కుమారుడు అనిల్‌కుమార్, అపోలో ఆస్పత్రుల చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి కూతురు శోభనల కుమార్తె అయిన ఉపాసన నిశ్చితార్థాన్ని దోమకొండ కోటలోనే నిర్వహించారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాల కలెక్టర్‌గా ఉమాపతిరావు సేవలందించారు. ఉమాపతిరావుకు భార్య పుష్పలీలతో పాటు, కుమారుడు అనిల్‌ కామినేని, కూతురు శోభ ఉన్నారు.  

నేడు దోమకొండలో అంత్యక్రియలు 
దోమకొండలోని లక్ష్మీబాగ్‌లో ఉమాపతిరావు అంత్యక్రియలను గురువారం ఉదయం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, రామ్‌చరణ్‌ కుటుంబ సభ్యులతో పాటు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

ముఖ్యమంత్రి సంతాపం 
ఉమాపతిరావు మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సం తాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

మరిన్ని వార్తలు