ఫౌండేషన్‌  స్టోన్‌ మాదే

23 Sep, 2018 14:05 IST|Sakshi
లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారానే జరగాలనే జీఓ ప్రతిని చూపుతున్న దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, (వరంగల్‌): గోదావరి జలాలను నర్సంపేటకు తరలించాలలనే సంకల్పంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిధులు మంజూరు చేయగా ఫౌండేషన్‌ స్టోన్‌ వేసింది తామేనని, పనులు ప్రారంభించింది కూడా తామేనని ఏఐసీసీ సభ్యుడు, తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తూ పెద్ది సుదర్శన్‌రెడ్డి జలయాత్ర పేరుతో నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులను తరలించి అబద్దపు ప్రచారంతో లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. వాస్తవానికి 2008–09లోనే ఫేజ్‌–3 ప్యాకేజీ–5 కింద కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.330 కోట్లను విడుదల చేసిందని గుర్తు చేశారు.

ఈ పనులు జరుగుతున్న క్రమంలోనే 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభ్వుం ఏర్పాటయ్యాక రీడిజైన్‌ పేరుతో స్వార్థం కోసం రైతులకు నష్టం కలిగే పనులు చేశారని ఆరోపించారు. జూరాల–పాకాల వాగ్దానం ఏమైందని, ప్రస్తుతం ఆ మాటను ఎందుకు దాటేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు గోదావరి–పాకాల అంటూ ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారని, దీనిని రైతులు గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రతి పథకానికి లబ్ధిదారులను గ్రామసభల ద్వారానే ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే మేలు జరుగుతున్న విషయమై కలెక్టర్‌ చొరవ తీసుకుని పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నియోజవర్గ కన్వీనర్‌ ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మండల అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పెండెం రామానంద్, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు హింగె మురళీ,  కౌన్సిలర్‌ పుల్లూరి స్వామి, పట్టణ యూత్‌ అధ్యక్షుడు కోల చరణ్, వైనాల కార్తీక్, నియోజకవర్గ యూత్‌ నాయకులు వేముల ఇంద్రదేవ్‌తోపాటు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు