గెలుపు మాదే      

21 Mar, 2018 07:07 IST|Sakshi
ఏఐసీసీ సభ్యుడు దొంతి మాధవరెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే నిధుల మంజూరు

‘సాక్షి’ ఇంటర్వ్యూలో నర్సంపేట ఎమ్మెల్యే, ఏఐసీసీ సభ్యుడు దొంతి మాధవరెడ్డి

నర్సంపేట : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ ప్రధాన కారణం అనే భావన ప్రజల్లో బలంగా ఉంది. రానున్న రోజుల్లో ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కడతారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ 8 చోట్ల భారీ మెజార్టీతో గెలు స్తుంది. మరో నాలుగింట్లో గట్టి పోటీ ఇస్తుంద ని ఏఐసీసీ సభ్యుడు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో ఏఐసీసీ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మాధవరెడ్డి నర్సంపేటకు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

కాంగ్రెస్‌పై విశ్వాసం పెరిగింది
సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల కోరికను తీర్చింది. గత ఎన్నికల సమయంలో సోనియాగాంధీ కృషిని ప్రజలు గ్రహించకుండా తీర్పును ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. హామీలను అమలు చేయకపోవడంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయి, కాంగ్రెస్‌ పార్టీపై విశ్వాసం పెంచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పడతారు. 

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నరు
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోంది. బంగారు తెలంగాణగా మారుస్తామంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్తున్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడం లేదు. అప్పులు తీసుకువచ్చి కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. కానీ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం లేదు.  

కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి
సీనియర్ల సహకారంతో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ముందుకుసాగుతా. 38 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నా. సీనియర్‌ నాయకులు, కింది స్థాయి నాయకులు, కార్యకర్తలతో కలసి గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తా.

గొంతు నొక్కుతున్నారు..
సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తే ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అని గొంతు నొక్కేస్తోంది. ఎలాంటి తప్పు చేయకుండానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసింది. సమస్యలను ప్రస్తావించకుండా గొంతు నొక్కేసే ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణం పాఠం చెప్పే సమయం సైతం ఆసన్నమైంది. 

నర్సంపేట అభివృద్ధికి ప్రత్యేక కృషి..
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష బలంగా ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయా ంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమానంగా నిధులు కేటాయించారు. కానీ, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం నిధులు సక్రమంగా మంజూరు చేయకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధి ఇబ్బందిగా మారింది. వచ్చిన కొద్దిపాటి నిధులను నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నా. రాజకీయ కోణంలో ప్రతిపక్ష పార్టీలకు ని«ధుల కేటాయింపులో పక్షపాతం చూపిస్తున్నరు.

నాడు ఉద్యమం గుర్తు లేదా?
1969లో తెలంగాణ ఉద్యమం బలంగా వచ్చింది. ఆ తర్వాత 1977లోనే రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ పార్టీలో పని చేశారు. పదవి కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన కేసీఆర్‌కు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనేది గుర్తులేదు. పదవి ఊడిపోయిన తర్వాత రాజకీయంగా భవిష్యత్‌ లేదనే కారణంతోనే తెలంగాణ రాష్ట్రం కావాలని నినాదంతో ఉద్యమం చేపట్టారు. అయితే 1977లో ఎందుకు ఉద్యమించలేదు. కేవలం కేసీఆర్‌ ఉద్యమిస్తేనే కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయా పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించాయి. సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నేడు తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోంది.  
 

మరిన్ని వార్తలు