ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా జాక్వెలీన్‌ హ్యూగ్స్‌

1 May, 2020 09:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ జాక్వెలిన్‌ డీ అరోస్‌ హ్యూగ్స్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్‌కు చెందిన హ్యూగ్స్‌ మైక్రో బయాలజీ, వైరాలజీల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1990లలో కోకో రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసేందుకు ఆఫ్రికాలోని ఘనా దేశానికి వెళ్లిపోయారు. అక్కడి నుంచి నైజీరియాలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ అగ్రికల్చర్‌లో కొంతకాలం పనిచేశారు. (అంతటితో ‘ఆగ’లేదు! )

తైవాన్‌లోని వరల్డ్‌ వెజిటబుల్‌ సెంటర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన హ్యూగ్స్, ఇంటర్నేషనల్‌ రైస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోనూ అదే హోదాలో పనిచేశారు. తాజాగా రైస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నుంచి ఇక్రిశాట్‌కు మారారు. ప్రయాణాలపై నిషేధమున్న నేపథ్యంలో హ్యూగ్స్‌ ఫిలిప్పీన్స్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇక్రిశాట్‌ బాధ్యతలు చేపట్టడమే కాకుండా.. తన ప్రాథమ్యాల గురించి వివరించారు. కరోనా విషయంలో ఇక్రిశాట్‌ ఎక్కడ అవసరమైతే అక్కడ సాయం అందించాలని హ్యూగ్స్‌ స్పష్టంచేశారు. మెట్ట ప్రాంతాల్లో పంటల ఉత్పాదకతను పెంచేందుకు ఇక్రిశాట్‌ తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని తెలిపారు. (మన్ను.. మన్నిక ఇక్రిశాట్‌ చెప్పునిక!)

మరిన్ని వార్తలు