‘పల్లా’కు ఎమ్మెల్సీ టికెట్..?

22 Feb, 2015 03:46 IST|Sakshi

నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వరరెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పట్టభద్రుల స్థానానికి పల్లాను పోటీలో నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారికంగా పల్లా పేరును ఆదివారం ప్రకటించే అవకాశం ఉంది.
 
 చివరివరకు టికెట్ వస్తుందని ఆశించినపార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డిని కూడా అందుబాటులో ఉండాల్సిందిగా సీఎం పేర్కొన్నట్లు సమాచారం. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పల్లా పోటీచేసి ఓడిపోయారు. వరంగల్ జిల్లాకు చెందిన ఆయన కోదాడలో అనురాగ్ పేరుతో ఇంజినీరింగ్, ఇతర విద్యాసంస్థలను నిర్వ హిస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలతో పల్లాకు సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. మంత్రి జగదీష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇదిలా ఉంటే బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కూడా వరంగల్ జిల్లాకు చెందిన రామ్మోహన్‌రావు కావడం గమనార్హం. పట్టభద్రుల స్థానానికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులను వరంగల్ జిల్లా నుంచే ఎంపిక చేయడం విశేషం.
 
 మూడో నామినేషన్లు నిల్ ...
 పట్టభద్రుల స్థానానికి మూడో రోజు కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. ఆదివారం నాటి కి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తియ్యే అవకాశం ఉంది. కావున సోమవారం నామినేషన్లు దాఖలుకానున్నాయి.
 

మరిన్ని వార్తలు