ఇదేం ‘దారి’ద్య్రం !

29 Apr, 2019 07:32 IST|Sakshi
కొత్తగూడెం – పాల్వంచ మధ్య జాతీయ రహదారి పనులు సాగుతున్న దృశ్యం

పాల్వంచరూరల్‌:  భద్రాచలం జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది కలుగుతోంది. పెంచిన గడువు ప్రకారం గత మార్చి నెలాఖరు నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా కాంట్రాక్టర్, అధికారుల 
నిర్లక్ష్యంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. మూడవ ప్యాకేజీ కింద సుమారు రూ.229 కోట్ల వ్యయంతో సారపాక నుంచి రుద్రంపూర్‌ వరకు 42 కిలోమీటర్ల మేర ఫోర్‌ లేన్‌ జాతీయ రహదారి పనులు సాగుతున్నాయి.

2017 నాటికే ఈ పనులు పూర్తి కావాల్సి ఉన్నా.. ఇప్పటికి 36 కిలోమీటర్ల వరకు మాత్రమే రోడ్డు నిర్మించారు. ఇంకా 6 కిలోమీటర్ల రహదారి పనులు చేపట్టాల్సి ఉంది. మొర్రేడు, గోధుమ వాగులపై రెండు బ్రిడ్జీలు కూడా నిర్మించాల్సి ఉంది. ఇవి కాకుండా పెద్దమ్మగుడి సమీపంలో కల్వర్టు పనులు చేపట్టాలి. ఇల్లెందు క్రాస్‌ రోడ్డు నుంచి సింగరేణి గెస్ట్‌ హౌస్‌ వరకు ఒకవైపు రహదారి పనులు ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. రామవరం వద్ద గోధుమ వాగుపై బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాలేదు.

గోదావరి బ్రిడ్జిదీ ఇదే దుస్థితి..  
భద్రాచలం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి పనులు సైతం నత్తనడకనే సాగుతున్నాయి. ఇక జాతీయ రహదారికి ఇరువైపులా డ్రైనేజీ పనులు కూడా అస్తవ్యస్తంగానే చేశారు. 54 కిలోమీటర్ల దూరం డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు 24 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 30 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. పెద్దమ్మగుడి ఎదుట ఇంకా నిర్మాణ పనులు పూర్తికాలేదు. ఆరోగ్యమాత చర్చి నుంచి సీ కాలనీ గేటు, బస్టాండ్‌ సెంటర్‌ నుంచి దమ్మపేట సెంటర్‌ వరకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మించలేదు. అయితే ఒకవైపు రోడ్డు ఎత్తుగా, మరోవైపు తక్కువ ఎత్తు ఉండటంతో వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. పెద్దమ్మగుడి సమీపంలోని జగన్నాధపురంలో ఒకవైపు రోడ్డు నిర్మాణం కోసం గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు. పనులు చేసే మార్గంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు.

కేవలం ఇసుక బస్తాలను కొన్ని చోట్ల, డ్రమ్ములను మరికొన్ని చోట్ల పెట్టారు. దీంతో రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హైవే పనులు నత్తనడకన సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017 జూలై నాటి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలనే ఒప్పందం ఉండగా, జాప్యం కావడంతో అ«ధికారులు గడువును ఏడాది పాటు పొడిగించారు. అది కూడా పూర్తయినా.. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇక రోడ్డు పనులు నిలిపిన చోట హెచ్చరిక బోర్డులుగా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయక పోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.
 
అస్తవ్యస్తంగా ఫుట్‌పాత్‌ నిర్మాణం..
జాతీయ రహదారి నిర్మాణం పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తుండగా.. ఫుట్‌పాత్‌ పనులు మరీ దారుణంగా ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్‌ఫాత్‌ నిర్మాణం చేసిన తర్వాత క్యూరింగ్‌ చేయక పోవడం, పటిష్టంగా నిర్మించకపోవడంతో అక్కడక్కడ ఇటుకలు లేచి పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్‌ఫాత్‌ నిర్మాణ పనులను పటిష్టంగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.  

త్వరగా పూర్తిచేయాలి 
భద్రాచలం నుంచి రుద్రంపూర్‌ వరకు నాలుగు సంవత్సరాల క్రితం చేపట్టిన హైవే రోడ్డు నేటికీ పూర్తి కాలేదు. చేస్తున్న పనుల్లోనూ నాణ్యత లేదనే  అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు త్వరగా, నాణ్యంగా చేపట్టాలి.   – షఫీ, రామవరం

ఇంకెన్నాళ్లకు పూర్తి చేస్తారో 
జాతీయ రహదారి పనులు నత్తడకన సాగుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా మారింది. ఫుట్‌ఫాత్‌ పనులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. వేసవిలో క్యూరింగ్‌ లేకుండా పనులు చేస్తున్నారు.   – రాము, పాల్వంచ

రెండు వాగులపై బ్రిడ్జీలు నిర్మించాల్సి ఉంది 
జాతీయ రహదారి నిర్మాణ పనులు అపకుండా నిర్వహిస్తున్నాం. దాదాపుగా పూర్తి కావచ్చాయి. మొర్రేడు వాగు, గోధుమ వాగులపై రెండు బ్రిడ్జీలను  నిర్మించాల్సి ఉంది. మూడు నెలల్లో ఈ పనులు పూర్తిచేస్తాం. గోదావరి నదిపై కూడా బ్రిడ్జి నిర్మాణం అక్టోబర్‌ నాటికి పూర్తి చేస్తాం. ఈ ఏడాది జనవరి నాటికి రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో కాంట్రాక్టర్‌కు పదిశాతం అపరాధ రుసుం విధించాం. – వెంకటేశ్వరరావు, హైవే ఈఈ    

>
మరిన్ని వార్తలు