పంచాయతీల్లో ‘డ్రై డే’ 

22 Mar, 2019 02:53 IST|Sakshi

దోమల నివారణకు వారంలో ఒకరోజు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టనున్నారు. దోమలు వృద్ధి చెందకుండా నిరోధించేందుకు వారానికి ఒకరోజు ‘డ్రై డే’నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పంచాయతీ సిబ్బంది వారానికి ఒకరోజు ఇంటింటికి వెళ్లి డ్రై డే పాటించాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇళ్లు.. వాటి చుట్టూ పరిసరాల్లోని గుంటలు, తొట్టెలు, పాత టైర్లు.. తదితరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు.  

కలెక్టర్లు, డీపీవోలకు ఆదేశాలు.. 
పంచాయతీల్లో పారిశుధ్యం, హరితహారం, వీధిలైట్లు, పన్నుల వసూలు తదితరాలకు సంబంధించి గత నెలలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలకు కొనసాగింపుగా జిల్లా కలెక్టర్లు, డీపీవోలకు పంచాయతీరాజ్‌ శాఖ మరిన్ని ఉత్వర్వులిచ్చింది. ఈ ఆదేశాలను అన్ని గ్రామ పంచాయతీలకు పంపించి, వాటిని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ నీతూ కుమారి ఇటీవల ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలోని అన్ని పల్లెలను పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా అన్ని జిల్లాల్లో మూడు నెలల ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం వివిధ రూపాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు (క్యాంపెయిన్‌) చేపట్టాలని సూచించింది. కార్యక్రమంలో భాగంగా 90 రోజుల పాటు ప్రతీ గ్రామ పంచాయతీలో వివిధ చర్యలు చేపట్టాలని నిర్దేశించింది.  

తాజా ఆదేశాలు... 
అన్ని గ్రామాల్లోని రోడ్లను ప్రతిరోజూ శుభ్రపరచాలి. చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించాలి. ఘనవ్యర్థాల నిర్వహణ షెడ్‌ నిర్మించి ఉంటే కంపోస్ట్‌ తయారీకి చర్యలు ప్రారంభించాలి. ఠి రోజు విడిచి రోజు మురుగుకాల్వలు శుభ్రపరచాలి. ఖాళీ ప్రదేశాల్లో పొదలు, తుప్పలను తొలగించాలి. ఠి ఉపయోగించని బావులను పూడ్చాలి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా వాటిని పూడ్చేయాలి. ఠి స్కూళ్లు, ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, మార్కెట్లు శుభ్రపరిచేందుకు ఒకరోజు కేటాయించాలి. ఠి రాష్ట్రం లోని 12,751 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ఠి రైతులు తమ పొలాల్లోని గట్లు, బావుల చుట్టూ మొక్కలు నాటేలా చూడాలి. ఠి గ్రామాల్లోని అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి. ఠి గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయాలి.

మరిన్ని వార్తలు