‘సీతమ్మ సాగర్‌’ ప్రాజెక్టుగా దుమ్ముగూడెం

15 Feb, 2020 03:28 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌ : గోదావరి నీటి నిల్వతో పాటు జల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేలా దుమ్ముగూడెం వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీకి సీతమ్మసాగర్‌గా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.ఈ మేరకు సాగునీటి శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని ఇది వరకే నిర్ణయం తీసుకోగా, దాని పేరుమార్చుతూ జీవోలు విడుదల చేయాలని ఇంజనీర్లకు సూచించారు. దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన భద్రాచలం సీతమ్మ వారి పర్ణశాలకు దగ్గరగా బ్యారేజీ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో దీని పేరును సీతమ్మ సాగర్‌గా పెట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే గోదావరిపై చేపట్టిన తుపాకులగూడెం పేరుకు సమ్మక్క పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి రెండుమూడు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

మరిన్ని వార్తలు