భూకంపం వదంతులు

21 Aug, 2014 02:03 IST|Sakshi

భైంసా రూరల్ : నిజామాబాద్ జిల్లాలో అప్పుడే పుట్టిన శిశువు భూ కంపం వస్తుందని చెప్పి కన్నుమూసిందని, మహారాష్ట్రలో భూకంపం వచ్చిందని, ఇక్కడ కూడా రాబోతోందనే వదంతులతో జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోయారు. మంగళవారం ఉదయం నుంచి సమగ్ర కుటుంబ సర్వేలో బిజీగా గడిపిన ప్రజలు ఈ వదంతులతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

 అర్ధరాత్రి వేళ ఫోన్‌కాల్స్ ఏమిటని లిఫ్ట్ చేసిన ప్రజలు భూకంపం రానుందని అవతలి వ్యక్తి చెప్పిన మాటలు విని షాక్‌కు గురయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంటకు మొదలైన ఈ వదంతులు వివిధ మండలాలకు క్షణాల్లో దా వానంలా వ్యాపించాయి. సమాచారం అందడమే ఆలస్యం అన్నట్లుగా.. అనేక మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు.

 జాగారం..
 సర్వే పుణ్యమా అని స్థానికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సంతోషంగా గడిపారు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వ్యాపించిన భూకంప వదంతులు అందరినీ భయకంపితులను చేశాయి. ఒంటి గంటకు ప్రారంభమైన ఈ పుకార్లు నాలుగు గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అధికశాతం ప్రజలు రోడ్లపైకి వచ్చి జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణంతోపాటు గ్రామాల్లోనూ ప్రజలు వేకువజాము వరకు జాగారం చేశారు. మరికొందరు ఆలయాల్లో పూజలు చేసి కాపాడాలని ఇష్టదైవాన్ని వేడుకున్నారు. వాడవాడలా ప్రజలు గుంపులుగా ఏర్పడి చర్చించుకున్నారు.

 ఫోన్లలో సమాచారం చేరవేత..
 భూకంపం వచ్చిందనే వదంతులు వివిధ ప్రాంతాలకు వ్యా పించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు.. ఇలా ప్రతిఒక్కరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర, నిజామాబాద్, ఇతర జిల్లాల్లో ఉన్న బంధువులను సైతం ఆరా తీశారు. మరికొందరు సమాచారం తెలుసుకునేందుకు వేకువజాము వరకు టీవీలకు అతుక్కుపోయారు. అయితే ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెల్లారేసరికి ఆ వార్త పుకారేనని తెలిసిన జనం అజ్ఞాత వ్యక్తిని తిట్టుకుంటూ ఇళ్లలోకి వెళ్లారు.

 గతంలోనూ...
 గతంలోనూ ఇలాంటి వదంతులు నిర్మల్ వాసులను తీవ్ర కలవరపెట్టాయి. మహారాష్ట్ర ప్రాంతంలోని ఓ గుడిలో పూజా రి పూజలు చేస్తూ మృతిచెందాడని, అంతకుముందు భూకం పం వస్తుందని చెప్పాడంటూ వచ్చిన పుకార్లు ఈ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేసింది. చివరకు అవన్నీ వదంతులేనని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

మరిన్ని వార్తలు