ఓటర్ల జాబితా ఖరారయ్యాకే ఎన్నికలు..

7 Sep, 2018 14:12 IST|Sakshi
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికల సన్నాహాలపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈవీఎం, వీవీపీఏటీల మీద అవగాహన కార్యక్రమం తొలి దశ సమావేశం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు.

అసెంబ్లీ రద్దుపై గవర్నర్‌ ఇచ్చిన సమాచారం ఢిల్లీకి నివేదించామని, ఎన్నికల నిర్వహణకు తమ సంసిద్ధతను సీఈసీ కోరుతుందని వివరించారు. జాతీయ స్ధాయిలో ఎన్నికల షెడ్యూల్‌ ఉందని, ఇక్కడ అవసరాలను తాము సీఈసీకి వివరించామని చెప్పారు.

సిబ్బంది, బడ్జెట్‌, శాంతిభద్రతలు వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం ఖరారు చేస్తారని తెలిపారు. ఓటర్ల జాబితా వెల్లడైన తర్వాతనే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. తాను సీఈసీతో భేటీ అయ్యేందుకు సోమవారం ఢిల్లీ వెళుతున్నానని చెప్పారు.

మరిన్ని వార్తలు