ఒడిసి పడదాం.. దాచి పెడదా

20 May, 2019 07:54 IST|Sakshi
ప్రాజెక్టులో భాగంగా వీబీఐటీ కళాశాల నడక దారిలో బిగించిన పేవర్స్‌ వర్షపు నీరు భూమిలోకి ఇంకడానికి పేవర్స్‌ మధ్య ఏర్పాటు చేసిన ఖాళీలు

వర్షపు నీటిని ఆదా చేస్తే ఎంతో మేలు  

వరదల నివారణకు ఎకో ఫ్ల్రెండ్లీ ప్రాజెక్టు

‘రిసెప్టివ్‌ పేవర్‌’తో ఇంజినీరింగ్‌  విద్యార్థుల భగీరథ ప్రయత్నం

భూగర్భ జలాలు పెంపొందే అవకాశం

ఘట్‌కేసర్‌: విపరీతంగా జనాభా పెరగడంతో హైదరాబాద్‌ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. నగరం చుట్టూ ఉన్న మేడ్చల్, రంగారెడ్డిలో కనిపించే పచ్చని పంట పొలాలు నేడు ప్లాట్లుగా మారి వేలాది కాలనీలు వెలిశాయి. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయి. కాలనీల ఏర్పాటుతో నీటి వనరులకు ఎక్కడికక్కడే అడ్డకట్ట వేయడంతో వర్షాలు కురిసినా నీరు భూమిలోకి ఇంకకుండా రోడ్డుపై చేరి కాలనీలు మునిగిపోతున్నాయి. సెల్లార్‌లో కారు ఆపి నిద్రపోయిన ఓ డ్రైవర్‌ కారులోకి వర్షం నీరు చేరి మృతి చెందిన  ఘటన నగరంలో జరిగినా అధికారులు, ప్రజల్లో చలనం రావడం లేదు. అభివృద్ధి పేరుతో సీసీ రోడ్లు నిర్మించడంతో కాంక్రీట్‌ జంగిల్‌లా మారి వర్షం నీరు ఇంకే అవకాశం లేక మూసీలో కలుస్తున్నాయి. ప్రభుత్వం ఇంకుడు గుంతలపై ప్రచారం చేసినా ప్రజల్లో అవగాహన లేక ఎవరూ ముందుకు రావడం లేదు. నీటి బొట్టును వృథా చేయకూడదని ఘట్‌కేసర్‌ మండలం వీబీఐటీ కళాశాల ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తోట రాజు, రవి, దివాకర్, హెచ్‌ఓడీ కృష్ణారావు సహకారంతో ముందడుగు వేశారు. వరద ముప్పు రాకుండా భూగర్భ జలాలను పెంచేందుకు నడుం బిగించారు. ‘రిసెప్టివ్‌ పేవర్స్‌’ పేరు తో ప్రాజెక్టును తయారు చేసి ఏడాది పాటు కళాశాలలో ప్రయోగించగా మంచి ఫలితం కనిపించడంతో పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

వరద ముçప్పును తప్పించే యత్నం..
నగరంలో వరద తీవ్రత తగ్గించి భూగర్భ జలాలను పెంచేందుకు విద్యార్థులు ఈ ప్రాజెక్టును రూపొందించారు. కళాశాలలో 1,400 చదరపు అడుగుల విïస్తీర్ణంలో రూ.1.4 లక్షలతో రిసెప్టివ్‌ పేవర్‌ను నిర్మించారు. దీనిపై వరద నీటిని పంపించడంతో లోపలికి గుంజుకోవడంతో భూగర్భ జలాలు పెరిగినట్లు గుర్తించారు. ఈ విధానంతో నగరంలో వరద ముప్పును తíప్పించ వచ్చని చెబుతున్నారు. 

వృథాగా వదలకూడదని..  
ఇళ్లల్లో ఇంకుడు గుంతలు నిర్మిస్తే çస్థలం వృథా అవుతుందని చాలామంది ఆసక్తి చూపడం లేదు. ఇంటి స్థలం పోను పార్కింగ్, ఖాళీ స్థలంలో టైల్స్‌కు బదులు ఈ ప్రాజెక్టును అమలు చేస్తే ఎటువంటి సమస్య తలెత్తకుండా వర్షాకాలంలో భూమి చిత్తడిగా మారదు. రోడ్డుపైకి వచ్చిన నీటి ని పేవర్స్‌ (టైల్స్‌) పీల్చుకొని కిందున్న కంకరలోకి పంపిస్తాయి. అక్కడి నుంచి భూమిలోకి వెళ తాయి. దీంతో వరదలు రావు. కానీ ఆ ప్రదేశంలో భారీ వాహనాలు కాకుండా కార్లు, ద్విచక్ర వాహనాలు, లైట్‌ వెహికిల్స్‌ను మాత్రమే నడపాలి.  

నిర్మాణ విధానం ఇలా..
ప్రాజెక్టును నిర్మించదల్చుకున్న ప్రాంతంలో రెండు ఫీట్ల లోతు æగుంతను తవ్వి ఫీటు మేర 40 ఎంఎం కంకర, తర్వాత అర ఫీటు మేర 20 ఎంఎం కంకర పరచాలి. కంకరపై గోనె సంచులు గాని, జియో టెక్స్‌ టైల్స్‌ లేయర్‌ను గాని వేసి మూడు ఇంచుల మేర ఇసుక పోయాలి. అనంతరం ఇసుకపై పేవర్స్‌ (టైల్స్‌)ను పార్కింగ్, వాకింగ్‌ చేసే స్థ«లాల్లో సిమెంట్‌ను వినియోగించకుండా బిగించాలి. ఒకసారి నిర్మిస్తే ఏళ్ల పాటు సేవలందించే ఒక్కో టైల్‌కు రూ. 480 వ్యయం కాగా చదరపు అడుగుకు మూడు అవసరం అవుతాయి. చుక్క నీరు వృథా కాకుండా లోపలికి వెళతాయి. దీంతో ఎంత వరద వచ్చినా ముప్పు వాటిల్లకుండా నీరంతా భూమిలో ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి.

ఎక్కడ అనుకూలం....
రోడ్లకు ఇరువైపులా, ఫుట్‌పాత్‌లు, పార్కులు, గార్డెన్స్, కాలినడక బాటలో, రైల్వేస్టేషన్స్, బస్‌స్టేషన్స్, పార్కింగ్, వాకింగ్‌ ట్రాక్‌లు తదితరుల ప్రాంతాల్లో వీటిని ఉపయోగించవచ్చు.

మరిన్ని వార్తలు