పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న విద్యాశాఖ
ఇంటర్ ఫలితాల వివాదాల నేపథ్యంలో అప్రమత్తం
వచ్చే వారంలో టెన్త్ ఫలితాలు విడుదల చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పుల కారణంగా తలెత్తిన వివాదాల నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. త్వరలో విడుదల కానున్న పదోతరగతి పరీక్షల ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా పక్కా చర్యలు చేపడుతోంది. తొందరపడి ఫలితాలు ప్రకటించి 5.5 లక్షల మంది విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టకుండా.. ఒకటికి రెండు, మూడుసార్లు పునఃపరిశీలన జరిపాకే ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించింది. పదో తరగతి పరీక్ష ఫలితాల ప్రాసెస్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి.. శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ విజయ్కుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్, ఇతర అధికారులు, సాంకేతిక సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
పదోతరగతి పరీక్షల ఫలితాల విషయంలో ఒక్క పొరపాటు కూడా జరక్కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. స్కానింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఫలితాల ప్రాసెస్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో తప్పులు దొర్లకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. తప్పులు దొర్లకుండా పక్కాగా పరిశీలన జరపడంతోపాటు ఒకవేళ విద్యార్థులకు అనుమానాలున్నా, ఫిర్యాదు చేయాలన్నా ఆన్లైన్లోనే చేసేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
విద్యార్థులు హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా, తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుని లాగిన్ నుంచి, లేదా ఇంటర్నెట్ సెంటర్ నుంచి ఫిర్యాదు చేసేలా, దానికి మెసేజ్ రూపంలో రెస్పాన్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా రీ–వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. శనివారం నుంచి వచ్చే నాలుగైదు రోజులు పునఃపరిశీలన జరుపనున్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక వీలైతే వచ్చే 10వ తేదీన ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. పరిశీలన ప్రక్రియ కనుక సవ్యంగా పూర్తికాకపోతే 15వ తేదీలోగా పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు. మొత్తానికి 10–15 తేదీల మధ్య ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
పరీక్షల విషయంలో తీసుకోనున్న జాగ్రత్తలివే!