బడుగుల గుడి.. సర్కారీ బడి

12 Sep, 2017 01:38 IST|Sakshi
బడుగుల గుడి.. సర్కారీ బడి

► 11.86 లక్షల మంది ఓసీల్లో 1.86 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో
► 28.72 లక్షల మంది బీసీల్లో 15.15 లక్షల మంది చదువులు ప్రైవేటు స్కూళ్లలో


ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న ఎస్సీ విద్యార్థులు  6,60,000
ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న ఎస్టీ విద్యార్థులు 4,75,000

సాక్షి, హైదరాబాద్‌: దుర్భరమైన ఆర్థిక పరిస్థితులతో నిరుపేద కుటుంబాలు తమ పిల్లలను సర్కారు బడుల్లో చదివిస్తుంటే.. కొంత మేరకు ఆప్పు చేసే స్తోమత కలిగిన కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్సీల్లో 61.68%, ఎస్టీల్లో 72.99% విద్యార్థులు ప్రభుత్వ బడుల్లోనే చదువుతుండగా, 15.68 శాతం నిరుపేద ఓసీ (జనరల్‌) కుటుంబాలకు చెందిన పిల్లలు సర్కారు బడికే వెళ్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్న వారిలో ఎక్కువ శాతం ఓసీ విద్యార్థులుండగా, తక్కువ శాతం మంది ఎస్సీ, ఎస్టీల పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు.

ఇక 47% మంది బీసీ విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుండగా 53 శాతం బీసీ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. 2016–17 విద్యా సంవత్సరంలో విద్యాశాఖ సేకరించిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇపుడు మరోసారి 2017–18 విద్యా సంవత్సరం లెక్కల సేకరణపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈసారి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి సామాజిక వర్గాల వారీగా వివరాలను సేకరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

బీసీ కమిషన్‌ ఆదేశాలతో..
రాష్ట్రంలో బీసీ విద్యార్థులు, వారి కులాలకు సంబంధించిన వివరాలు సమగ్రంగా కావాలని ఇటీవల రాష్ట్ర బీసీ కమిషన్‌ విద్యాశాఖను కోరింది. దీంతో ఆ వివరాల సేకరణపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఈ మేరకు జిల్లాల్లోని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్ల సామాజిక వివరాలను కూడా అందజేయాలని ఆదేశించింది. ఏటా సెప్టెంబర్‌లో జిల్లాల వారీగా విద్యార్థుల సమగ్ర వివరాలను (యు–డైస్‌) విద్యాశాఖ సేకరిస్తోంది.

అయితే ఇప్పటివరకు సామాజిక వర్గాలను జనరల్, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనారిటీలుగానే పేర్కొనేది. కానీ ఈనెలలో ప్రారంభించనున్న వివరాల సేకరణలో సదరు విద్యార్థి ఏ సామాజిక వర్గానికి చెందినవాడు అన్న వివరాలను కూడా ప్రత్యేకంగా సేకరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 40,091 పాఠశాలల్లో (అన్ని రకాల మేనేజ్‌మెంట్లలో) 65,00,128 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో 29,20,683 మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో 35,79,445 మంది చదువుతున్నారు. ఇప్పుడు వారందరి వివరాలను సేకరించనున్నారు.

రిజర్వేషన్‌ కేటగిరీల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల శాతం
మేనేజ్‌మెంట్‌    ఓసీ    ఎస్సీ    ఎస్టీ    బీసీ    ముస్లిం మైనారిటీలు
ప్రభుత్వ    15.68    68.61    72.99    47.23    29.24
ప్రైవేటు    84.32    31.39    27.01    52.77    70.76

ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది?
రాష్ట్రంలోని 28,829 ప్రభుత్వ పాఠశాలల్లో 1,86,064 మంది ఓసీ విద్యార్థులు చదువుతుం డగా, ఎస్సీ విద్యార్థులు 6,60,277 మంది చదువుతున్నారు. ఇక ఎస్టీ విద్యార్థులు 4,75,932 మంది చదువుతుండగా, బీసీ విద్యార్థులు 13,56,630 మంది చదువుతున్నారు. ముస్లిం మైనారిటీ విద్యార్థులు 2,41,780 మంది ఉన్నారు.

‘ప్రైవేటు’లో సామాజిక వర్గాల వారీగా
రాష్ట్రంలోని 11,262 ప్రైవేటు స్కూళ్లలో ఓసీ విద్యార్థులు 9,99,999 మంది ఉండగా, ఎస్సీ విద్యార్థులు 3,02,214 మంది చదువుకుంటున్నారు. ఎస్టీ విద్యార్థులు 1,76,189 మంది మాత్రమే ప్రైవేటు స్కూళ్లలో చదువుతుండగా, బీసీలు 15,15,715 మంది వాటిల్లో చదువుకుంటున్నారు. ముస్లిం మైనారిటీ విద్యార్థులు 5,85,328 మంది ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నారు.

బీసీ–‘ఏ’కేటగిరీలో అనాథ పిల్లలు
అనాథ పిల్లలను బీసీ–‘ఏ’కేటగిరీగా పేర్కొం టూ పాఠశాలల్లో చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. అనాథ బాలల కోసం ఏర్పాటు చేస్తున్న 31 అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించే క్రమంలో ఈ పిల్లలను బీసీ–‘ఏ’కేటగిరీ రిజర్వేషన్‌ కింద పేర్కొనాలని విద్యాశాఖ ఆదేశించింది.

మరిన్ని వార్తలు