ఆస్తి కోసం తమ్ముడి హత్య

17 Jul, 2015 15:22 IST|Sakshi

దోమ (రంగారెడ్డి జిల్లా) : ఆస్తి కోసం ఓ యువకుడు అక్క, బావతో కలిసి సొంత తమ్ముడిని హత్య చేశాడు. అడ్డువచ్చిన తండ్రిని కూడా తీవ్రంగా గాయపర్చాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నారాయణపూర్ గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దోమ మండలం బొంపల్లి గ్రామానికి చెందిన ముద్దం శ్రీనివాస్(25)కు ఆస్తి విషయంలో అన్న, సోదరితో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తన పొలంలో పని చేస్తున్న శ్రీనివాస్‌పై అన్న కృష్ణయ్య, అక్క నర్సమ్మ, బావ అంజలయ్యలు కలిసి దాడి చేశారు. ట్రాక్టర్ సహాయంతో పొలం దున్నుతున్న తమ్ముడిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా సంఘటనా స్థలంలోనే పొలం పనులు చేస్తున్న తండ్రి ముద్దం రామయ్య(55) వారిని అడ్డుకోవడంతో అతనిపై కూడా దాడి చేశారు. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉండటంతో గ్రామస్తులు పరిగిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా నిందితులు ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు