శివుని దర్శనం చేసుకొని తిరిగి వెళుతూ ఒకరి మృతి

14 Feb, 2018 16:56 IST|Sakshi
పోచయ్య మృతదేహం

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటన

మృతుడు కన్‌సాన్‌పల్లి వాసి

జోగిపేట(అందోల్‌): మహాశివరాత్రి సందర్భంగా రాంసానిపల్లి గ్రామంలోని శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అందోల్‌ మండలం కన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన వని పోచయ్య (60) మరణించాడు. మంగళవారం సాయంత్రం పోచయ్య తన మోపెడ్‌ వాహనంపై (టీఎస్‌ 15ఈఏ 3901) రాంసానిపల్లి నుంచి కన్‌సాన్‌పల్లి గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.

రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జోగిపేట వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రోడ్డు మీద పడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మృతుడికి ఒక కొడుకు, భార్య ఉన్నారు. ముదిరాజ్‌ కులానికి చెందిన పోచయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోచయ్యకు భక్తి ఎక్కువ కావడంతో దేవాలయంలో జరిగిన భజనలో పాల్గొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు