ప్రచార ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలి 

15 Nov, 2018 16:05 IST|Sakshi
మాట్లాడుతున్న ఎస్‌ఆర్‌ సింగ్‌  

నిర్మల్‌టౌన్‌: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా శాసనసభ ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థుల ప్రచార ఖర్చుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎస్‌ఆర్‌ సింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌సెల్‌లో బుధవారం మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్‌ సెంటర్‌ (ఎంసీఎంసీ)లో ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రింట్‌మీడియాలో అభ్యర్థుల ప్రకటనలు, ప్రచారానికి సంబంధించిన వివరాలు పరిశీలించారు. ఎంసీఎంసీ కేంద్రంలోని సిటికేబుల్‌ చానల్స్, దినపత్రికలను పరిశీలించి ఖర్చుల వివరాల నమోదు రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. శాసనసభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు రూ.28 లక్షలకు మంచి ఖర్చు చేయకుండా పటిష్ట నిఘా ఉంచాలన్నారు. ఎంసీఎంసీ కమిటీ అనుమతి లేకుండా ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వర్టయిజ్‌మెంట్లు ప్రసారం చేయవద్దని తెలిపారు. ప్రతీరోజు స్క్రోలింగ్, అడ్వర్టయిజ్‌మెంట్లను రికార్డు చేయాలని, అలాగే చెల్లింపు వార్తలను గుర్తించి సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి, సహాయ ఎన్నికల ఖర్చు అధికారికి నివేదిక పంపాలన్నారు.

అభ్యర్థుల క్రిమినల్‌ కేసులు పత్రికల్లో ప్రచురించాలని సంబంధిrత ఖర్చుల వివరాలను నమోదు చేయాలన్నారు. కంట్రోల్‌ రూం, సీ–విజిల్‌లో వచ్చిన అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంక్‌ల నుంచి లావాదేవీలకు సంబంధించిన స్టేట్‌మెంట్లు తెప్పించుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ ఎంసీఎంసీ కేంద్రంలో రెండు సిటికేబుల్‌ చానల్స్‌ సంబంధించిన అభ్యర్థుల అడ్వర్టయిజ్‌మెంట్‌ ప్రకటనలను రికార్డు చేస్తున్నామన్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ దినపత్రికలలో ప్రచురితమైన అడ్వర్టయిజ్‌మెంట్లు, పెయిడ్‌ న్యూస్‌లను కట్‌ చేసి వాటి ఖర్చుల వివరాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు పంపుతున్నామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం కంట్రోల్‌ రూం, సీ–విజిల్‌ యాప్‌  కేంద్రాన్ని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వివరించారు. ఇందులో జేసీ భాస్కర్‌రావు, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, డీపీఆర్‌వో అబ్దుల్‌ కలీం, జిల్లా ఎన్నికల వ్యయ అధికారి, డీసీవో సూర్యచందర్‌రాజు, ఈ డిస్ట్రిక్‌ మేనేజర్‌ నదీం, ఏవో కరీం, ఎన్నికల సూపరింటెండెంట్‌ ఫారూక్‌ తదితరులున్నారు.    

మరిన్ని వార్తలు