కేంద్ర ఎన్నికల సంఘం @ 68 ఏళ్లు..!

18 Nov, 2018 17:30 IST|Sakshi

సాక్షి, ఆలేరు : కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ఏడాది ఎన్నికల నిర్వహణతో 68 ఏళ్లు పూర్తయ్యాయి. 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడింది. దీనికి తొలి కమిషనర్‌గా సుకుమార్‌సేన్‌ నియమితులయ్యారు. ఆయన 1950 మార్చి 21 నుంచి 1958 డిసెంబర్‌ 19 వరకు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటి వరకు ఇద్దరు తెలుగువారు కమిషనర్లుగా వ్యవహరించారు. వీరిలో ఆర్‌వీ పేరిశాస్త్రీ 1986  జనవరి 1 నుంచి 1990 నవంబర్‌ 25 వరకు పనిచేశారు. ఆయన తదనంతరం వీఎస్‌ రమాదేవి 1990 నవంబర్‌ 26 నుంచి అదే ఏడాది డిసెంబర్‌ 12 వరకు అంటే 15 రోజుల పాటు కమిషనర్‌గా పనిచేశారు.

కాగా ఎన్నికల సంఘం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయినందుకు గాను 2001లో గోల్డెన్‌ జూబ్సీ ఉత్సవాలు, ఆ తర్వాత 2010లో డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించారు. డైమండ్‌ జూబ్లీ ఉత్సవాల సందర్భంలో ఎన్నికల సంఘం పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఛీప్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఓంప్రకాశ్‌రావత్‌ పనిచేస్తున్నారు.

 
ఎన్నికల కమిషన్‌ ఇలా..
దేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, ఓటర్ల జాబితా తయారీ, భారత పార్లమెంటుకు, రాష్ట్రాల శాసనసభలకు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు సంబంధించిన మొత్తం వ్యవహారాలు చూసే బాధ్యతల్ని భారత రాజ్యాంగం ఒక కమిషన్‌కు అప్పగించింది. దానినే భారత ఎన్నికల కమిషన్‌గా వ్యవహరిస్తారు.

ఎన్నికల కమిషన్‌లో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు భారత రాష్ట్రపతితో నిర్దేశించబడిన సంఖ్య ప్రకారం కొందరు ఎన్నికల కమిషనర్లుగా ఉంటారు. ప్రధాన ఎన్ని కల కమిషనర్‌ ఎన్నికల కమిషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.  

మరిన్ని వార్తలు