బ్యాంక్‌ ఖాతాలపై కన్ను...

22 Nov, 2018 09:43 IST|Sakshi

జీరో ఖాతాలపై ప్రధాన దృష్టి 

ఇప్పటికే బ్యాంకర్లకు ఆదేశాలు 

ఎక్కువ లావాదేవీల వివరాల సేకరణ 

రంగంలోకి దిగిన ఎన్నికల ప్రత్యేకాధికారులు 

సాక్షి, కల్వకుర్తి టౌన్‌ : ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీల నాయకులు వివిధ మార్గాలలో తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధానంగా డబ్బుతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వేస్తున్న ఎత్తుగడలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

అనుమానిత బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు ఆదేశాలిచ్చారు. ఒకేసారి ఖాతాల్లో నగదు జమకావటం.. గతంలో తక్కువ లావాదేవీలు జరిగిన ఖాతాలలో ఈ మధ్య ఎక్కువగా లావాదేవీలు నిర్వహిస్తే వెంటనే నిఘా పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 


విస్తృత తనిఖీలు 
ముఖ్యంగా జీరో ఖాతాల విషయమై అధికారులు లోతుగా పరిశీలన చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆయా చెక్‌పోస్టుల వద్ద చేపట్టిన తనిఖీల్లో నేటి వరకు రూ.లక్షల్లో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన నగదే అయితే సంబంధిత వ్యక్తులు ఆధారాలు చూపించి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. 


అభ్యర్థుల లావాదేవీలపై 
ఒక్కో అభ్యర్థి ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం రూ.28 లక్షల మాత్రమే ఖర్చుచేయాలి. రోజువారి ఖర్చుల వివరాలను సైతం ఎన్నికల అధికారులకు చెప్పాలి. ఒకసారి నామినేషన్‌ పక్రియ పూర్తయిన తర్వాత, ఆ తర్వాత జరిగే ప్రతీ లావాదేవీలను ఎన్నికల వ్యయంగా పరిగణిస్తారు. కొంతమంది అభ్యర్ధులు తమ పేర్ల మీద కాకుండా బినామీల పేర్ల మీద ఎక్కువగా లావాదేవీలు చేస్తుంటారు. ఇప్పటికే బరిలో నిలిచిన అభ్యర్ధులు డబ్బులను సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి లావాదేవీలను కూడా అధికారులు డేగకన్నుతో పరిశీలిస్తున్నారు. 


పరిమితి దాటితే పరిశీలన 
ఎన్నికల సమయంలో బ్యాంకుల్లో ఖాతాలపై ఆదాయపు పన్ను, పోలీస్‌ శాఖ అధికారులు నిఘా పెట్టారు. ముఖ్యంగా జీరో అకౌంట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణంగా రూ.49,999 లావాదేవీలపై ఆంక్షలు ఉండవు. రూ.50వేలు దాటితే పాన్‌ కార్డు నంబర్‌ను తప్పనిసరిగా బ్యాంక్‌ అధికారులకు అందించాలి. ఎన్నికల నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు ఏ మాత్రం అనుమానం కలిగినా సంబంధిత ఖాతాలపై ఆరా తీస్తున్నారు.

రూ.లక్ష రూపాయలకు మించిన లావాదేవీలు జరిగిన ఖాతాలపై దృష్టి సారిస్తున్నారు. డిజిటల్‌ లావాదేవీల ద్వారా డబ్బులు చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించిన అధికారులు వాటిపైన కూడా దృష్టి సారించారు. మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, ఫించన్‌ దారుల ఖాతాలను కచ్చితంగా పరిశీలిస్తున్నారు. పరిమితికి మించిన లావాదేవీలు జరిగిన ఖాతాల వివరాలను అధికారులకు సమాచారం అందిస్తున్నారు.   

మరిన్ని వార్తలు