ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. పాలేరు ఉప ఎన్నిక సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో 90.01 శాతం పోలింగ్ నమోదైంది. అన్ని కేంద్రాల్లో ఉదయ 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. 2014 జరిగిన ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 92 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికలో సైతం అదే స్థాయిలో ఓటింగ్ నమోదయింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 19న ఫలితాలు వెలువడనున్నాయి.