వాల్గొండ అటవీప్రాంతంలో కలకలం

21 May, 2020 10:59 IST|Sakshi
మృతిచెందిన చుక్కల జింక

వన్యప్రాణుల వేటకు విద్యుత్‌తీగలు అమర్చిన దుండగులు

ట్రాక్టర్‌ దగ్ధం, వన్యప్రాణి మృతి  ∙పరారీలో నిందితులు

ఘటనస్థలాన్ని పరిశీలించిన పోలీస్, అటవీశాఖ అధికారులు

మల్లాపూర్‌(కోరుట్ల): వాల్గొండ అటవీ ప్రాంతంతో మంగళవారం రాత్రి  వన్యప్రాణులకోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌తీగలతో ట్రాక్టర్‌ దగ్ధమవగా, చుక్కల జింక మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని వాల్గొండ అటవీప్రాంతంలో ఆదే గ్రామానికి చెందిన ఇస్లావత్‌ శరినాయక్‌ కౌలుకు తీసుకున్న పొలంలో మొరం మట్టి పోసేందుకు ట్రాక్టర్‌ డ్రైవర్‌ చెట్‌పల్లి రాజు వెళ్లాడు. ఈ సమయంలో విద్యుదాఘాతానికి గురైన ట్రాక్టర్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. విషయాన్ని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఘటనస్థలికి వెళ్లగా వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్‌తీగలు గుర్తించారు. సంఘటన జరిగిన కొంతదూరంలో చుక్కల జింక కరెంట్‌షాక్‌కు గురై మృతిచెంది కనిపించింది. ప్రజాప్రతినిధులు వెంటనే పోలీస్, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి చుక్కల జింక మృతదేహాన్ని, దుండగులు వదిలి వెళ్లిన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు