విద్యుత్‌ ఉద్యోగుల మహాధర్నా 

16 Feb, 2018 01:58 IST|Sakshi
గురువారం విద్యుత్‌సౌధలో ధర్నా చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులు

ఏపీ ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా..  

సంఘీభావం తెలిపిన విద్యుత్‌ సీఎండీ ప్రభాకర్‌రావు  

హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి ఆంధ్రాకు రిలీవ్‌ అయిన ఉద్యోగులను తిరిగి వెనక్కి తీసుకోరాదని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగులు గురువారం విద్యుత్‌ సౌధలో మహాధర్నా చేశారు. స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థల ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. ఆంధ్రా ప్రభుత్వం, ఆంధ్రా విద్యుత్‌ యాజమాన్యం మొండివైఖరికి నిరసనగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. జేఏసీ ప్రతినిధులు రత్నాకర్‌రావు, బీసీ రెడ్డి, రాజేంద్రప్రసాద్‌ తదితరుల నాయకత్వంలో నిర్వహించిన ఈ ధర్నాకు తెలంగాణ విద్యుత్‌ సంస్థల సీఎండీ ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ఆంధ్రా ఉద్యోగుల విషయంలో అడ్వొకేట్‌ జనరల్‌ సలహా తీసుకుని ముం దుకు పోతామన్నారు. సీఎం ఢిల్లీ నుంచి రాగానే విష యం ఆయన దృష్టికి తీసుకువెళతానని, రాష్ట్ర ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.  

అన్యాయం జరగకుండా చూడాలి 
విద్యుత్‌ ఉద్యోగుల విభజన అంశంపై సీఎం స్పందించి రాష్ట్ర ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని జేఏసీ నాయకులు కోరారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయడం, లేదా హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయడం చేయాలని కోరారు.  

మరిన్ని వార్తలు