విద్యుత్‌ రాయితీ పెంపు

9 Mar, 2020 02:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విద్యుత్‌ రాయితీ కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. బడ్జెట్‌ 2019–20లో రూ.5,984 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ రాయితీలను కేటాయించగా,ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2020–21లో రూ.7,547 కోట్లకు పెంచింది. స్పిన్నింగ్‌ మిల్లులకు సహాయంగా అందించే రూ.95 కోట్ల విద్యుత్‌ సబ్సిడీలను యథాతథంగా కొనసాగించింది.

ఈ రెండు సబ్సిడీలు కలిపి ప్రగతిపద్దు కింద ఇంధన శాఖకు రూ.7,642 కోట్లు కేటాయించింది. నిర్వహణ పద్దు కింద మరో రూ.320.88 కోట్లు కలిపి ఇంధన శాఖకు బడ్జెట్‌లో మొత్తం రూ.7,962.88 కోట్ల నిధులు కేటాయించింది. ఇంధన శాఖకు రూ.10,416 కోట్లు కేటాయించినట్టు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన కాళేశ్వరం, సీతారామ వంటి భారీ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన విద్యుత్‌ బిల్లులతో పాటు ఎస్సీ,ఎస్టీలకు అందించే విద్యుత్‌ బిల్లుల రాయితీలు కలుపుకుంటే ఇంధన శాఖకు కేటాయింపులు రూ.10, 416 కోట్లకు పెరుగుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

చార్జీల పెంపు తప్పదు 
ఈ బడ్జెట్‌లో రూ.10 వేలకోట్ల వ్యవసాయ విద్యుత్‌ రాయితీలు కేటాయించాలని డిస్కంలు  కోరగా, ప్రభుత్వం రూ. 7,547 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో వచ్చే ఆర్థిక ఏడాదిలో చార్జీల పెంపు తప్పదని తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు