ఎంసెట్ కౌన్సెలింగ్ షురూ

13 Aug, 2014 01:48 IST|Sakshi
ఎంసెట్ కౌన్సెలింగ్ షురూ
  • రాష్ట్రంలో రేపట్నుంచి ‘ఎంసెట్’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  •   23 వరకు ప్రక్రియ పూర్తి.. తర్వాతే ఆప్షన్లు
  •   ఎంసెట్ ప్రవేశాల కమిటీ నోటిఫికేషన్ 
  •   రెండు రాష్ట్రాల్లో విడివిడిగా వెరిఫికేషన్..
  •  ఉమ్మడిగా ప్రవేశాలు.. నేడు ఏపీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో సంయుక్త సమావేశం
  •   వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తేదీల ఖరారు
  •  
     సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. గురువారం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 వరకూ ఇది కొనసాగనుంది. రెండు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ వేర్వేరుగా జరుగుతున్నప్పటికీ.. వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపును మాత్రం ఉమ్మడిగానే చేపట్టాలని తెలంగాణ, ఏపీ ఉన్నత విద్యా మండళ్లు దాదాపుగా అంగీకారానికి వచ్చాయి. మొత్తానికి సుప్రీం ఆదేశాల మేరకు ఈ నెల 31లోగానే ప్రవేశాలను పూర్తి చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ కౌన్సెలింగ్ ప్రక్రియను మొదలుపెడుతూ ఎంసెట్ ప్రవేశాల కమిటీ మిగతా మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తేదీలను ఖరారు చేసేందుకు బుధవారం నాడు ఇరు రాష్రాల ఉన్నత విద్యా మండళ్లతో సంయుక్త సమావేశం నిర్వహిస్తామని ప్రకటి ంచింది. దీనికి హాజరు కావాలంటూ తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యార్‌కు లేఖ రాసినట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి కూడా వెల్లడించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని అధికారవర్గాలు తెలిపాయి.
     
     రెండు రాష్ట్రాల్లోనూ గడువులోగా పూర్తి చేస్తాం: పాపిరెడ్డి
     సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీ నాటికి రెండు రాష్ట్రాల్లోనూ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. తెలంగాణలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై విద్యా శాఖ అధికారులు వికాస్ రాజ్, శైలజా రామయ్యార్‌తో మంగళవారం ఆయన సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23 నాటికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేస్తామని, తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఇందుకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఈ విషయంలో ఏపీ ఉన్నత విద్యా మండలితో మాట్లాడి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు.
     
     నోటిఫికేషన్ వివరాలు
     తెలంగాణలో రోజుకు 25 వేల మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేందుకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ కోకన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఎంసెట్-2014 (ఎంపీసీ విభాగం) పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ర్యాంకుల వారీగా నిర్ణీత తేదీల్లో తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల వివరాలను ఎంసెట్ వెబ్‌సైట్‌లో (https://eamcet.nic.in) అందుబాటులో ఉంచారు. రోజూ ఉదయం 9 గంటలకు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వెరిఫికేషన్‌కు విద్యార్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు మూడు సెట్ల కాపీలను తీసుకురావాలి. ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఇంటర్మీడియట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్, ఎస్‌ఎస్‌సీ తత్సమాన మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, జనవరి ఒకటి 2014 తర్వాత పొందిన ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, పీహెచ్/ఎన్‌సీసీ/స్పోర్ట్స్ తదితర సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాలి. ఓసీ బీసీ అభ్యర్థులు రూ. 600, ఎస్సీ, ఎస్టీలు రూ. 300 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. కాలేజీల ట్యూషన్ ఫీజుల వివరాలు, కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండే సీట్ల వివరాలను వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు ముందు ప్రకటిస్తారు. విద్యార్థుల ఆప్షన్లను బట్టి సీట్లను కేటాయిస్తారు. కాగా, వికలాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్/గేమ్స్ తదితర కేటగిరీల వారికి హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యా భవన్‌లోనే ఈ నెల 14, 16, 17, 18 తేదీల్లో వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్ల తేదీలను తర్వాత వెల్లడిస్తారు.
     
మరిన్ని వార్తలు