ఉద్యోగుల పీఆర్‌సీ ఉత్తర్వులు జారీ

7 Feb, 2015 04:07 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై శుక్రవారం రాత్రి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్‌సీ కమిషన్ సిఫారసుల మేరకు వేతన సవరణ చేసినట్లు అందులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేస్తున్నట్లు గురువారం ప్రకటించిన సీఎం కేసీఆర్... మంచి రోజైన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సూచించారు.

దీంతో ఆర్థికశాఖ ఆగమేఘాలపై ఈ ఫైలును సిద్ధం చేసింది. గురువారం అర్ధరాత్రి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ ఫైలుపై సంతకం చేశారు. అప్పటికే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లటంతో శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులు హడావుడి పడ్డారు. ఆ ఫైలును సీఎం ఆమోదం, సంతకం కోసం ఫ్యాక్స్‌లో ఢిల్లీకి పంపారు. సీఎం ఆమోదం అనంతరం రాత్రి 7 గంటలకు జీవో నం.12 జారీ చేసినట్లు అధికారికంగా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

మరిన్ని వార్తలు