‘ఉపాధి’ బకాయిలు రూ.1.60 కోట్లు

5 May, 2014 00:22 IST|Sakshi

ధారూరు, న్యూస్‌లైన్: మండలంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు డబ్బులు అందక నానా పాట్లు పడుతున్నారు. దాదాపు 25 గ్రామ పంచాయతీల పరిధిలో  7 నుంచి 8 వేల మంది కూలీలు ఈ పథకం కింద పనులు చేస్తున్నారు. వేసవి కాలంలో వ్యవసాయ పనులు అంతగా లేకపోవడం, సమీప పట్టణాలకు కూలీ పనులు చేసేందుకు వెళ్తున్నా ఓ రోజు పని దొరకడం, మరో రోజు దొరక్కపోవడంతో  ఉపాధి పనుల చేయుడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఉపాధి పనుల కోసం పేర్లు నమోదు చేసుకున్న వారంతా ఫీల్డ్ అసిస్టెంట్ సూచించిన పొలానికి వెళ్లి పనులు చేస్తున్నారు.

  రెండు నెలల నుంచి కేరెల్లి గ్రామ కూలీలు రూ.1.60 కోట్ల విలువైన పనులు చేసి జిల్లాలో రెండో స్థానంలో నిలిచారు. అయితే ఇంత కష్టపడినా తమకు కూలీ డబ్బులు ఇవ్వడం లేదుని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిబంధన అంటూ డబ్బులు రాకుండా చేశారని చెప్పారు. రెండు నెలలుగా ఇంటి అవసరాలకు డబ్బులు అందక పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. కనీసం నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఈ విషయమై ఏపీఓ వై.శ్రీనును వివరణ కోరగా డబ్బులు రానిదే నిజమేనని, రూ.1.60 కోట్ల బకాయలున్నాయని చెప్పారు. వారం రోజుల డబ్బులు వచ్చినట్లు ఆదివారం తమకు సమాచారం వచ్చిందని, దశల వారీగా మిగిలిన డబ్బులన్నీ వస్తాయని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు