ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి

26 Jul, 2018 04:41 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌

మిర్యాలగూడ టౌన్‌: తెలంగాణ ఏర్పడితే నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు 1.7 ల క్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్‌ ..ఆ మేరకు ఉద్యోగాలిచ్చిన తరువాతనే ఎన్నికల్లోకి వెళ్లాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. నాలుగు ఏళ్లలో భర్తీ చేయలేని ఉద్యోగాలను, కేసీఆర్‌ ఈ పది నెలల్లో ఏ విధంగా భర్తీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్‌ వేయ కుండా నిర్లక్ష్యం చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా మారిపోయిందన్నారు. కోర్టు వివాదాల్లో లేకుండా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించారన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మెహన్‌రెడ్డి కూడా నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ధర్నాలో పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, నాయకులు సలీం, బాలకృష్ణారెడ్డి, రవికుమార్, మేష్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు