అంతరించిపోతున్న మానవ సంబంధాలు..

15 Sep, 2014 02:01 IST|Sakshi

అనుబంధానికి రక్తపు మరకలు..
 రక్త సంబంధీకుల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. క్షణికావేశంలో అనార్థాలు చోటు చేసుకుంటున్న ఘటనలు జిల్లాలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం.. తండ్రిని కొడుకు చంపడం.. తల్లిని కొడుకు చంపడం.. వంటి ఘాతుకాలు అనుబంధానికి విఘాతం కలిగిస్తున్నాయి. పేగు బంధాన్ని మరిచి ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు.

 జీవితాంతం తోడునీడగా ఉండాల్సిన భార్యాభర్తలు చిన్నచిన్న కారణాలతోనే బంధాలను తెంచుకుంటున్నారు. వరకట్న వేధింపులు, వివాహేతర సంబంధాలు, కుటుంబ తగాదాలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రక్త సంబంధంలో ప్రాణాలు అర్పించైనా తన వారిని కాపాడుకోవాలనే వారే కరువయ్యారు. కేవలం డబ్బుల కోసం మనుషుల ప్రాణాలు తృణప్రాయంగా తీస్తున్న సంఘటనలు కోకొళ్లం.
 
 జిల్లాలో జరిగిన హత్యలు మచ్చుకుకొన్ని..
 మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రి హత్య : ఆదిలాబాద్ మండలం బంగారిగూడకు చెందిన రామకృష్ణ తన తండ్రి సత్యనారాయణ (70) మద్యానికి డబ్బులు ఇవ్వలేదని క్షణికావేశంలో జూన్ 12న కర్రతో దాడి చేసి హత్య చేశాడు.
స్నేహితున్ని కడతేర్చాడు : కూలీ పంపిణీ విషయమైన ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. జూన్ 16న మంచిర్యాల తిలక్‌నగర్‌కు చెందిన మబ్బు రాజశేఖర్‌ను తనతో పనిచేసే మందిగ సిర్సులు గొడ్డలితో నరికి హత్య చేశాడు.
రాజకీయ హత్య : బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ సర్పంచ్ మంద రవిని రాజకీయ కక్షలతో జూన్  21న కొంత మంది ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఇది జిల్లాలోనే పెనుకలకలం రేపింది.
 భార్య అందంగా లేదని హత్య : కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లి గ్రామానికి చెందిన సల్పాల సంతోష్ తన భార్య అందంగా లేదంటూ చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలో జూన్ 26న భార్య లలిత (23)తో గొడవ పెట్టుకొని ఆమెను చున్నితో ఉరివే సిహత్య చేశాడు.
 అనుమానం పెనుభూతమై.. : వేమనపల్లికి చెందిన శాంత ఉరఫ్ ఫాతిమా (40) కూలీపని చేస్తూ కుటుంబాన్ని పోషించింది. పనికి వెళ్లిన తన భార్య ఇతరులతో చనువుగా ఉంటుందని ఆమెపై భర్త యూసుఫ్ అనుమానం పెంచుకొని జూన్ 27న రోకలి బండతో దాడిచేసి హత్యకు పాల్పడ్డాడు.
 చిచ్చురేపిన గుడుంబా : జూలై 2న జన్నారం మండలం బొమ్మన గ్రామానికి చెందిన ఆరే భీమయ్య (38) బంధువులతో కలిసి గుడుంబా తాగుతుండగా జరిగిన గొడవ హత్యకు దారితీసింది. సదరు బంధువులు తిరుపతి, భానుచందర్, నరేందర్ భీమయ్యను రాయితో బాది హత్యకు పాల్పడ్డారు.
 వివాహేతర సంబంధం : సిర్పూర్-టి డోరపల్లి గ్రామానికి చెందిన దహెగావ్‌కర్ లహానుబాయి (46) భర్త రామ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. జూలై 12న భర్తను వేరే మహిళతో వెళ్తుండగా చూసిన లహానుబాయి వారిని వెంబడించి పట్టుకొని భర్తను నిలదీసింది. దీంతో గొడవ పెరిగి ఆగ్రహంతో రామ భార్య లహనుబాయిని చీర కొంగుతో ఉరివేసి హత్య చేశాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నారు.
 భార్య చేతిలో.. : జూలై 12న భర్త వేధింపులు భరించలేక మంచిర్యాలలోని ఎన్టీఆర్‌నగర్‌లోని మౌటం సారయ్య (50)ను  అతడి భార్య అంజమ్మ రోకలి బండతో కొట్టి చంపింది.
 పందుల వ్యాపారి హత్య : జూలై 19న జైపూర్ మండలం పెగడపెల్లి గ్రామానికి చెందిన దుగ్యాల రాములు (28) అనే పందుల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు.
 గొంతుకోసి : నిర్మల్ పట్టణానికి ఉపాధి కోసం వలస వచ్చిన మహారాష్ట్ర వాసి సీహెచ్ సురేష్ (40)ని అతడి భార్య చంద్రకళ జూలై 20న పట్టణంలోని బైల్‌బజార్‌లో హత్య చేసింది. భర్త వేధింపులు భరించలేక మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి గొంతుకోసి హత్యకు పాల్పడ్డారు.
 దారుణహత్య : లక్ష్మణచాంద మండలంలోని రాచాపూర్ గ్రామ శివారులో జూలై 23న కుంటాల మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన బట్టి నాగయ్య(55)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
 చిత్రహింసలకు గురిచేసి.. : ఆగస్టు 23న నెన్నెల మండలంలోని కోనంపేటకు చెందిన కొడిపే ఎంకమ్మ (38)ను భర్త మల్లయ్య కాల్చి పొడిచి హత్య చేశాడు. రోజూలాగే మద్యం తాగివచ్చి భార్యతో చిత్రహింసలు చేసి హత్య చేశాడు.
 రైతు హత్య.. : ఆగస్టు 23న కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన చౌడారపు కిష్టయ్య (55) అనే రైతును అదే గ్రామానికి చెందిన ఇందూర్ నరేష్ పాత కక్షల నేపథ్యంలో గొడ్డలితో దాడిచేసి హత్యకు పాల్పడ్డాడు.
 ఫొటోగ్రాఫర్ దారుణ హత్య.. : ఆగస్టు 25న బెల్లంపల్లి పట్టణంలో తాండూర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ కొడిపే నర్సిములు (25)ను తన స్నేహితుడు సతీష్ ఇంటికి పిలిపించి ముగ్గురి సహాయంతో వాహన క్లచ్‌వైర్‌తో నర్సిములుకు ఉరివేసి దారుణ హత్య చేశారు.
 ఇద్దరి దారుణ హత్య.. : ఆగస్టు 30న నిర్మల్ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న కల్లు బట్టి కార్మికులు మేకల నర్సిములు (65), ఎర్గట్ల బాపురావు (51)ను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడిచేసి హత్యకు పాల్పడ్డారు.
 ఇంటికి పిలిచి.. విషం కలిపి.. : ఆగస్టు 30న బెజ్జూర్ మండలం అగర్‌గూడ గ్రామానికి చెందిన కాటెల దామాజీ (54)ని అదే గ్రామానికి చెందిన దన్నూరి గంగ పాత కక్షలతో ఇంటికి పిలిపించి విషం కలిపిన మద్యాన్ని తాగించి మరీ హత్యకు పాల్పడింది.
 ఇనుప రాడ్‌తో దాడి చేసి.. : సెప్టెంబర్ 11న మంచిర్యాల పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన పంజ సులోచన (30)తో సహజీవనం చేస్తున్న మందమర్రి మండలం బొక్కలగుట్ట తిమ్మాపూర్‌కు చెందిన వెంకటేశ్ ఆమె మెడపై ఇనుప రాడ్‌తో కొట్టి దారుణంగా చంపాడు.
 వీఆర్‌ఏ హతం.. : సెప్టెంబర్ 11న బెజ్జూర్ మండలంలోని దింద గ్రామానికి చెందిన వీఆర్‌ఏ వగాడి నారాయణ (48)ను అదే గ్రామానికి చెందిన వెంకటి గొడ్డలితో నరికి చంపాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని హత్యకు పాల్పడ్డాడు.
 కారంపొడి చల్లి.. కత్తులతో నరికి... : సెప్టెంబర్ 12న జన్నారం మండలం పొన్కల్ గాంధీనగర్‌కు చెందిన కోట రవి (31) బైక్‌పై వస్తున్నప్పుడు మార్గమధ్యలో కాపుకాసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కళ్లలో కారంచల్లి కత్తులతో నరికి చంపారు.

మరిన్ని వార్తలు