నిశ్చితార్థం రోజే యువకుడి ఆత్మహత్య

29 Feb, 2016 02:03 IST|Sakshi

జమ్మికుంట :  నిశ్చితార్థం రోజు ఓ యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జమ్మికుంటలో ఆదివారం జరిగింది. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో రామగుండం జీఆర్పీ ఇన్‌చార్జి ఎస్సై బషీరొద్దీన్ వివరాలు వెల్లడించారు. వీణవంక మండం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి చంద్రమౌళి(26) దూరవిద్యావిధానంలో డిగ్రీ చదువుతూ హైదరాబాద్‌లో సీసీ కెమెరాలు బిగించే పనులు చేస్తున్నాడు. కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు చంద్ర మౌళికి వివాహం చేయాలని నిర్ణయించారు. ఆదివారం నిశ్చితార్థానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. శనివారం సాయంత్రం చంద్రమౌళి కొత్త బట్టలు తెచ్చుకునేందుకు హన్మకొండ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి  బయలుదేరాడు.

రాత్రి వరకు ఇంటికి రాలేదు. ఆదివారం తెల్లవారుజామున జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. స్థానికంగా లభించిన ఆధారాలతో పోతిరెడ్డిపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు జీఆర్పీ ఇన్‌చార్జి ఎస్సై తెలిపారు. బంధువులకు మృతదేహన్ని అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు