జూన్‌లోనే ఇంజనీరింగ్‌ ప్రవేశాలు!

16 Dec, 2016 04:47 IST|Sakshi
జూన్‌లోనే ఇంజనీరింగ్‌ ప్రవేశాలు!

జనవరి 1 నుంచి 31 వరకు ఇంజనీరింగ్‌ కాలేజీల అనుబంధ గుర్తింపునకు దరఖాస్తులు
జనవరి 25 నుంచి ఫిబ్రవరి 25 వరకు కాలేజీల్లో నిజనిర్ధారణ కమిటీ తనిఖీలు
ఏప్రిల్‌లోగా కాలేజీలతో సంప్రదింపులు పూర్తి
మే నెలాఖరులోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు  


సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరంలో (2017–18) ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో ఆలస్యం కాకుండా ఉన్నత విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. జూన్‌లోనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమైంది. ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సిన యూని వర్సిటీలను అందుకు సమాయత్తం చేసింది. ఇందులో భాగంగా జనవరి 1 నుంచే ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు దరఖాస్తుల ప్రక్రియను ప్రారం భించాలని జేఎన్‌టీయూహెచ్‌ నిర్ణయించింది. కాలేజీల అనుబంధ గుర్తింపునకు షెడ్యూల్‌ ఖరారు చేయ డంతోపాటు గుర్తింపు ఇచ్చే క్రమంలో అమలు చేయాల్సిన నిబంధనలపై ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలతో జేఎన్‌టీయూహెచ్‌ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించింది. ఈసారి ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపైనా చర్చించింది. పీహెచ్‌డీ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తామని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఎంటెక్‌ కోర్సులకు ప్రతి బ్రాంచ్‌కు పీహెచ్‌డీ అర్హతగల ఇద్దరు ప్రొఫెసర్లు ఉండాలని, బీటెక్‌లో ప్రతి బ్రాంచ్‌కు పీహెచ్‌డీ విద్యార్హతగల ప్రొఫెసర్‌ కచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని... లేదంటే అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేసినట్లు తెలిసింది. మంజూరైన సీట్ల మేరకు కాకుండా, కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీ ఉండే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కాలేజీల యాజమాన్యాలు కోరగా అందుకు జేఎన్‌టీయూహెచ్‌ అంగీకరించినట్లు సమాచారం.

ముందుగానే తనిఖీలు...
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులిచ్చే ముందే కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించేలా జేఎన్‌టీయూహెచ్‌ షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఏఐసీటీఈతో సంప్రదించిన అధికారులు వారి సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్‌ మొదట్లో లేదా నెలాఖరులో ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఏఐసీటీఈ జారీ చేయనుంది. ఆ జాబితా సాంకేతిక విద్యాశాఖకు అందేలోపే అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా జేఎన్‌టీయూ హెచ్‌ చర్యలు చేపట్టింది. జాబితా అందిన వెంటనే మే నెలలో కాలేజీలకు అనుబంధ గుర్తింపు పత్రాలను జారీ చేసి ప్రవేశాలకు సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది.

 ఈ మేరకు రూపొందించిన అనుబంధ గుర్తింపు షెడ్యూల్‌ను కాలేజీ యాజమాన్యాలకు తెలిపి అందుకు సిద్ధంగా ఉండా లని సూచించినట్లు తెలిసింది. జనవరి 1 నుంచి 31 వరకు కాలేజీల నుంచి అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తులను స్వీకరిస్తామని తెలియజేసినట్లు సమాచారం. అదే నెల 25 నుంచి ఫిబ్రవరి 25 వరకు నిజనిర్ధారణ కమిటీల (ఎఫ్‌ఎఫ్‌సీ) ఆధ్వర్యంలో కాలేజీల్లో వసతులపై తనిఖీలు చేపడతామని తెలియజేసినట్లు తెలిసింది. వీలైతే తనిఖీలను ఏఐసీటీఈ బృందాలతో కలిపి చేసేందుకు ప్రయ త్నిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఏప్రిల్‌ నెలా ఖరులోగా కాలేజీల యాజమాన్యాలతో ఎఫ్‌ఎఫ్‌సీ నివేది కలపై చర్చలు జరిపి లోపాలను సవరించుకునేలా అవకాశం ఇవ్వను న్నట్లు తెలిసింది. అనుబంధ గుర్తింపు పత్రాలను మే మొదటి వారం నుంచి చివరిలోగా జారీ చేసి జూన్‌ 1కల్లా ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలియవచ్చింది.

>
మరిన్ని వార్తలు