కన్నెపల్లిలో వెట్‌రన్‌కు సన్నాహాలు

27 May, 2019 02:55 IST|Sakshi

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటార్లకు పరీక్షలు (వెట్‌రన్‌) నిర్వహించేందుకు ఇంజనీరింగ్, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. మొదట ఈ నెల 8, ఆ తర్వాత 15, 25 తేదీల్లో వెట్‌రన్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినా సాంకేతిక పరమైన కారణాల వల్ల వాయిదా పడింది. ఆదివారం కన్నెపల్లి సమీపంలోని గోదావరి నుంచి అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా నీటిని హెడ్‌ రెగ్యులేటరీలోని మూడు గేట్ల ద్వారా ఫోర్‌బేలోకి వదిలారు. అక్కడి నుంచి నీరు పంపుల కింద భాగంలోకి చేరుతుంది. ప్రస్తుతం పంపుహౌస్‌ వద్ద హడావుడి మొదలైంది. వెట్‌రన్‌ నిర్వహించే తేదీని మాత్రం అధికారులు వెల్లడించడంలేదు. నీటి స్థాయిలను ఎప్పటికప్పుడు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, డీఈఈ సూర్యప్రకాశ్, మెఘా కంపెనీ ప్రతినిధులు సీజీఎం వేణుమాధవ్, పీఎం వినోద్‌ పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు