రేపటి నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు

31 Jul, 2019 02:05 IST|Sakshi

ఏర్పాట్లు చేస్తున్న యూనివర్సిటీలు 

15 రోజులపాటు ఇండక్షన్‌ ప్రోగ్రాం 

ఆ తర్వాత రెగ్యులర్‌ తరగతులు 

కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌కే ప్రాధాన్యం 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించేందుకు వర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి.  ఇంజనీరింగ్‌ తొలిదశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ముగిసిపోగా, రెండో దశ సీట్ల కేటాయింపు సోమవారం పూర్తయింది. తొలిదశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌ కోటాలో 69,544 సీట్లు అందుబాటులో ఉండగా, 49,012 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. 16,432 సీట్లు మిగిలి పోయాయి. సీట్లు లభించిన వారిలో 37, 257 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరగా, 11,755 మంది చేరలేదు. విద్యార్థులు కాలేజీల్లో చేరకుండా, మిగిలిన సీట్ల తో మిగిలిన మొత్తం 28,187 సీట్లను ఇటీవల ప్రారంభించిన చివరి దశ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచగా, 12,700 మందికి సీట్లు లభించాయి. వారంతా మంగళ, బుధవారాల్లో కాలేజీల్లో చేరా లని గడువు విధించింది. చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారిలో మరో 10 వేల మంది విద్యార్థులే కాలేజీల్లో చేరే అవకాశముంది. మొత్తంగా కన్వీనర్‌ కోటాలో 47 వేల మంది విద్యార్థులు కాలేజీల్లో చేరినట్లు అవుతుంది. వారికి ఆగస్టు 1 నుంచి కాలేజీల్లో తరగతులను ప్రా రంభించేందుకు వర్సిటీలు చర్యలు చేపట్టాయి. ఈ మేరకు ఉస్మానియా, జేఎన్టీయూలు కాలేజీ యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశాయి. జేఎన్టీయూ పరిధిలోని చాలా కాలేజీలు ఆగస్టు 5 నుంచి తరగతులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాయి. 

తొలుత బేసిక్‌ అంశాలు.. 
మొదటి 15 రోజులు సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు కాకుండా, విద్యార్థులకు ఇండక్షన్‌ ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్‌ బేసిక్‌ అంశాలతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్, క్రియేటివ్‌ ఆర్ట్స్, కల్చర్, మెంటరింగ్, యూనివర్సల్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ తదితర అంశాలపై అవగాహన తరగతులు ఉంటాయి.  3 వారాల పాటు ఇండక్షన్‌ ట్రైనింగ్‌ ఇవ్వాల్సి ఉన్నా.. మొదట 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను చేపట్టి, ఆ తర్వాత మరో వారం తరగతులను సాయంకాల వేళల్లో నిర్వహించేలా వర్సిటీలు ఏర్పాటు చేశాయి. 

పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌కు ఏర్పాట్లు.. 
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీ చేసిన ఇంటర్న్‌íషిప్‌ పాలసీ ప్రకారం ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌ నిర్వహించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. అందుకోసం ఒప్పందాలను ముందుగానే కుదుర్చుకోవాలని కాలేజీలకు వర్సిటీలు ఆదేశాలు జారీ చేయనున్నాయి. ఇంటర్న్‌షిప్‌ పాలసీలో భాగంగా ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థి కోర్సు పూర్తయ్యే వరకు 600 నుంచి 700 గంటల పాటు ఇంటర్న్‌షిప్‌/ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది.  మొదటి ఏడాదిలో రెండో సెమిస్టర్‌ తర్వాత 3–4 వారాల పాటు కాలేజీ పరిధిలోకి ఇంజనీరింగ్‌కు సంబంధించిన అంశాలపై ఇంటర్న్‌షిప్, రెండో ఏడాదిలో నాలుగో సెమిస్టర్‌ పూర్తయ్యాక 4–6 వారాలు ఇండస్ట్రీలో ఇంటర్న్‌షిప్, మూడో సంవత్సరంలో ఆరో సెమిస్టర్‌ పూర్తయ్యాక 4–6 వారాలు ఇండస్ట్రీలో ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. నాలుగో సంవత్సరంలో 8వ సెమిస్టర్‌లో 3–4 వారాలు ప్రాజెక్టు వర్క్‌ పూర్తి చేయాలి. 

మరిన్ని వార్తలు