ఇంజనీరింగ్ ‘లక్ష’ణమే!

23 Feb, 2015 02:34 IST|Sakshi
ఇంజనీరింగ్ ‘లక్ష’ణమే!

లోపాల కాలేజీలకు ‘గుర్తింపు’ ఇవ్వబోమన్న జేఎన్టీయూహెచ్
అందుబాటులో ఉండే సీట్లు సుమారు లక్ష లోపే
కళాశాలల సంఖ్య 130కే పరిమితమయ్యే అవకాశం
 
రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య ఇక స‘లక్ష’ణం కానుంది. పుట్టెడు లోపాలతో నడుస్తున్న కాలేజీలకు ఇక పూర్తిస్థాయిలో చెక్ పడనుంది. సరిదిద్దుకోవడానికి అవకాశమిచ్చినా పట్టించుకోని కళాశాలలపై వేటు పడనుంది. అలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ‘గుర్తింపు’ ఇవ్వకూడదన్న జేఎన్టీయూహెచ్ నిర్ణయంతో కాలేజీలు, సీట్ల సంఖ్యలో భారీగా కోత పడనుంది. మొత్తంగా కాలేజీలు 130కి, సీట్ల సంఖ్య లక్షలోపుకే పరిమితం కానుంది. ఇక వెంటపడి సీట్లు కట్టబెట్టే పరిస్థితి పోయి.. ఇంజనీరింగ్ సీట్లకు కొంతవరకు పోటీ పెరిగే అవకాశముంది.
 
 సాక్షి, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. కాలేజీల సంఖ్య 130 వరకు పరిమితం కానుండగా... సీట్ల సంఖ్య కూడా లక్షలోపే ఉండే అవకాశం ఉంది. గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ ప్రవేశాలకు అనుమతి పొందిన 143 కాలేజీల్లో... 90 శాతం కాలేజీలకు 2015-16 ప్రవేశాల కోసం అనుబంధ గుర్తింపు లభించే పరిస్థితి కనిపించడం లేదు. వాటిల్లోని పదుల సంఖ్యలో కాలేజీలకు మాత్రమే అనుమతులు వచ్చే అవకాశం ఉంది.

అది కూడా ఆయా కాలేజీలు మళ్లీ తనిఖీల సమయం నాటికి తమ కాలేజీల్లో ఫ్యాకల్టీని పక్కాగా నియమించి, సదుపాయాలు కల్పిస్తేనే. ప్రస్తుతం ఆ 143 కాలేజీల్లో 80కి పైగా కాలేజీలు సీట్ల తగ్గింపు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. ఇక గత ఏడాది ప్రవేశాలు చేపట్టిన మరో 144 కాలేజీల్లో ఇప్పటికే 30 వరకు కాలేజీలు ప్రథమ సంవత్సరంలో తక్కువ సంఖ్యలో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి బదలాయించాయి. మరో 30 కాలేజీలు ప్రస్తుత విద్యా సంవ త్సరంలో లోపాలతో నడుస్తుండడంతో అనుబంధ గుర్తింపు లభించే పరిస్థితి కనిపించడం లేదు. దీనికితోడు చాలా కాలేజీలు సీట్ల తగ్గింపునకు దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి 2015-15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య 130కి, సీట్ల సంఖ్య లక్ష వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇక గత ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో పరీక్ష రాసినవారు 1,26,071 మంది కాగా.. ఈసారి వారి సంఖ్య 1.30 లక్షల వరకే ఉండే అవకాశం ఉంది.
 
 రాష్ట్రంలో 287 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో 1,80,425 సీట్లున్నాయి. అందులో కన్వీనర్ కోటాలో 1,14,291 సీట్లు ఉన్నాయి. అయితే గత ఏడాది యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన 144 కాలేజీల్లోని 85,021 సీట్లనే ప్రవేశాల కౌన్సెలింగ్‌లో చేర్చారు. ఇందులో కన్వీనర్ కోటాలో 68,516 సీట్లు అందుబాటులో ఉండగా... 55,925 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. దీంతో కన్వీనర్ కోటాలోనే 13 వేల వరకు సీట్లు మిగిలిపోయాయి.

ఇక 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్కో దాంట్లో 50 మందిలోపే విద్యార్థులు చేరారు. ఒక కాలేజీలోనైతే ఒక్కరూ చేరలేదు. ఇక పదిమందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు రెండున్నాయి. వంద మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీల సంఖ్య 21 కావడం గమనార్హం. దీంతో దాదాపు 30 కాలేజీల యాజమాన్యాలు తమ కాలేజీల్లో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో బదిలీ చేసేశాయి. ఫలితంగా ఆయా కాలేజీల్లో ప్రథమ సంవత్సరం కోర్సు నిలిచిపోయింది.
 
 అక్రమాలు ఇక బట్టబయలు..
 కాలేజీల్లో సదుపాయాలు, అక్రమాలు, అవకతవకల చరిత్ర ఇకపై బహిరంగం కానుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ప్రత్యేక వెబ్‌సైట్‌లో అన్ని కాలేజీల సమగ్ర వివరాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతామని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించగా... కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీపై నిపుణుల కమిటీలు చేసిన తనిఖీల నివేదికలను కూడా హైదరాబాద్ జేఎన్టీయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

2014-15 ప్రవేశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 143 కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతి ఇచ్చినా... ఇటీవల నిపుణుల కమిటీ నివేదికల తరువాత వాటి కి అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని జేఎన్టీయూహెచ్ స్పష్టం చేసింది. ఆయా కాలేజీల్లో లోపాలు ఎక్కువగా ఉన్నందున 2015-16 విద్యా సంవత్సరంలోనూ అనుబంధ గుర్తింపు లభించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో చాలా కాలేజీలు పూర్తిగా ప్రవేశాలకు దూరంకానున్నాయి.
 
 అవకాశమిచ్చినా..
 లోపాల కారణంగా గత ఏడాది 143 కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ ఇవ్వలేదు. దాంతో అవి సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రవేశాలకు అనుమతి పొందాయి. నవంబర్‌లో వాటికి కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. కానీ ఆ తర్వాత కూడా ఆయా కాలేజీలు లోపాలను సవరించుకోలేకపోయాయి. ఇటీవల నిపుణుల కమిటీలు చేసిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా అధ్యాపకుల సంఖ్య బాగా తక్కువగా ఉండడాన్ని అధికారులు గుర్తించారు.
 
 లోపాల పుట్టలు..
 చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో సరైన సంఖ్యలో అధ్యాపకులు లేరు. ఉన్నవారిలోనూ చాలా మందికి సరైన అర్హతలు కూడా లేవు. ఇక ఇంజనీరింగ్ ప్రాక్టికల్స్ కోసం అవసరమైన ల్యాబ్‌లు, లైబ్రరీలు సరిగా లేవు. అంతేకాదు సరైన మౌలిక సౌకర్యాలూ లేకపోవడం గమనార్హం. ఇక తనిఖీల సందర్భంగా ఒక్కో అధ్యాపకుడినే చాలా కాలేజీల్లో చూపించడం వంటి బాగోతమూ బయటపడింది.
 
 21 కాలేజీల్లో వంద మందిలోపే..
 రాష్ట్రంలో 287 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో 1,80,425 సీట్లున్నాయి. అందులో కన్వీనర్ కోటాలో 1,14,291 సీట్లు ఉన్నాయి. అయితే గత ఏడాది యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన 144 కాలేజీల్లోని 85,021 సీట్లనే ప్రవేశాల కౌన్సెలింగ్‌లో చేర్చారు. ఇందులో కన్వీనర్ కోటాలో 68,516 సీట్లు అందుబాటులో ఉండగా... 55,925 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. దీంతో కన్వీనర్ కోటాలోనే 13 వేల వరకు సీట్లు మిగిలిపోయాయి.

ఇక 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్కో దాంట్లో 50 మందిలోపే విద్యార్థులు చేరారు. ఒక కాలేజీలోనైతే ఒక్కరూ చేరలేదు. ఇక పదిమందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు రెండున్నాయి. వంద మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీల సంఖ్య 21 కావడం గమనార్హం. దీంతో దాదాపు 30 కాలేజీల యాజమాన్యాలు తమ కాలేజీల్లో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో బదిలీ చేసేశాయి. ఫలితంగా ఆయా కాలేజీల్లో ప్రథమ సంవత్సరం కోర్సు నిలిచిపోయింది.

>
మరిన్ని వార్తలు