44 ఇంజనీరింగ్‌ కాలేజీల  గుర్తింపుపై సందిగ్ధత! 

1 May, 2018 02:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని 44 ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతులపై సందిగ్ధత నెలకొంది. ఆయా కాలేజీలు 111 జీవో పరిధిలోని ప్రదేశాలు, భూదాన్‌ భూముల్లో ఉండటంతో వాటికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి నిరాకరించింది. దీంతో ఆయా కాలేజీలకు అనుమతులపై గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో మొత్తంగా 212 ఇంజనీరింగ్‌ కాలేజీలుండగా 168 కాలేజీల్లో ప్రవేశాలకే ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేసింది.

జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ గుర్తింపు జాబితాను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే నెల 7లోగా అనుబంధ గుర్తింపు జాబితాను ఇస్తామని జేఎన్‌టీయూహెచ్‌ పేర్కొనగా, వచ్చే నెల 15లోగా అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి ఆదేశించింది. ఏఐసీటీఈ గుర్తింపు లభించని కాలేజీల్లో ప్రముఖుల కాలేజీలు ఉండటంతో ఈలోగా వాటికి అనుమతులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. 

మే 2 నుంచి ఎంసెట్‌.. 
రాష్ట్రంలో ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలను మే 2 నుంచి 7 వరకు నిర్వహించేందుకు జేఎన్‌టీయూహెచ్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తంగా 2,20,990 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ రాసేందుకు 1,47,912 మంది, అగ్రికల్చర్‌ ఎంసెట్‌ రాసేందుకు 73,078 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు