ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల దుర్మరణం

4 Mar, 2018 14:16 IST|Sakshi
లోకేశ్‌గౌడ్, వైష్ణవి (ఫైల్‌)

భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : రోడ్డు ప్రమాదంలో మండలంలోని దేశ్‌ముఖిలోని విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం రంగారెడ్డి జిల్లా కవాడిపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. వనస్థలిపురానికి చెందిన  వైష్ణవి(20) బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది.

కాగా కళాశాలలో నిర్వహిస్తున్న విజ్ఞాన్‌ తరంగ్‌–2018 సాంస్కృతిక కార్యక్రమాలకు ఈమె ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే బస్సులో హయాత్‌నగర్‌ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌ వదకు వచ్చి అక్కడ నుంచి కళాశాలకు వెళ్లడానికి ఆటో కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఇదే కళా శాలలో బీ ఫార్మసీ చదువుతున్న కవాడిపల్లి గ్రామానికి చెందిన లోకేశ్‌గౌడ్‌(19) బైక్‌పై కాలేజీకి వెళ్తుండగా, లిఫ్ట్‌ అడిగి ఎక్కింది. ఈ క్రమంలో కవాడిపల్లి రామాలయం సమీపంలో టిప్పర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోగ, ఎదురుగా వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో బైక్‌ నడుపుతున్న లోకేశ్‌ అక్కడక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలైన వైష్ణవిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.

 ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కళాశాలలో పెనువిషాదం అలుముకుంది. వెంటనే విజ్ఞాన్‌ తరంగ్‌ సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసి కళాశాలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల మృతికి పట్ల కళాశాల యాజ మాన్యం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

మరిన్ని వార్తలు