గాడిలో పడేనా..?

26 Dec, 2014 02:59 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌కు ఖమ్మం హోదా పెరిగి రెండేళ్లు దాటింది. కానీ దానికి తగ్గట్టుగా పూర్తిస్థాయి కమిషనర్, మేనేజర్  లేరు. ఏళ్లుకు ఏళ్లుగా తిష్టవేసిన అధికారులతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఆమ్యామ్యాలు ముట్టజెబితేనే ఫైలు ముందుకు కదలడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ అవినీతికి చెక్ పెట్టేందుకు కార్పొరేషన్ సేవలను ఆన్‌లైన్ చేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను ఇక్కడి అధికారులు పట్టించుకోలేదు. పనితీరు బాగా లేదంటూ కలెక్టర్ అక్షిం  తలు వేసినా అధికారులు, సిబ్బందిలో చలనం లేదు. గతంలో ఏసీబీకి చిక్కినా, కొంతమందికి షోకాజ్ నోటీసులు వచ్చినా ఫలితం శూన్యం. ఇలా విధులపట్ల అధికారులు, సిబ్బంది అలసత్వంతో నగర పాలన గాడి తప్పింది.

ఇన్‌చార్జిలతో సరి
తొమ్మిది విలీన గ్రామ పంచాయతీలతో కలిపి ఖమ్మం మున్సిపాలిటీ 2012 అక్టోబర్‌లో కార్పొరేషన్‌గా అవతరించింది. 3.50 లక్షలకు పైగా జనాభాతో 50 డివిజన్లుగా విస్తరించింది. ఈ కార్పొరేషన్‌కు ఇప్పటివరకు అదనంగా ఒక్క అధికారి కూడా రాలేదు. కనీసం రెగ్యులర్ అధికారులు కూడా లేరు. నగర పాలనను గాడిలో పెట్టే కమిషనర్, మేనేజర్ పోస్టులను ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. రెవెన్యూ విభాగానికి పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో పన్నుల బకారుులు పేరుకుపోయాయి. శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా ఉంది. శానిటేషన్ విభాగానికి రెగ్యులర్ అధికారి లేరు. ఇన్‌చార్జి అధికారుల ఏలుబడిలో కార్పొరేషన్‌లో పాలన అస్తవ్యస్తమైంది.

ఇష్టారాజ్యం
కొందరు సిబ్బంది ఇక్కడే పాతుకుపోయూరు. ఏకధాటిగా ఇరవయ్యేళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. వీరు ఇక్కడ ‘ఆడింది ఆట.. పాడింది పాట’ అన్నట్టుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విధులకు రావడం, రాకపోవడం వీరిష్టమే. వీరికి పని వేళలంటూ లేవు. అవినీతి, అక్రమాలకు వీరు కేరాఫ్‌గా మారారు.

ప్రతి పనికి ఒక రేటు నిర్ణరుుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతికి పెచ్చుమీరింది. వివిధ పనుల కోసం ఇక్కడికి వచ్చిన నగర ప్రజలను పట్టించుకునే వారు లేరు. పింఛన్ల సమస్యలపై ఇటీవల వందలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు చెప్పులరిగేలా తిరుగుతున్నా మొహం చూసేవారు లేరు. ఇక్కడ  హెల్ప్‌లైన్ కేంద్రం లేదు.

ప్రధాన సమస్యలకు మోక్షమెప్పుడో..!
నగరంలో పలు ప్రధాన సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఏటా వేసవిలో నగర ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. దీని పరిష్కారం కోసం నగరం సమీపంలో సమ్మర్ స్టోరేజి ట్యాంకు నిర్మించాలన్న ప్రతిపాదనకు కాగితాలకే పరిమితమైంది. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది మంచినీటి ట్యాంకుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. నగరంలోని రోడ్ల విస్తరణ జరగడం లేదు.

ట్రాఫిక్ రద్దీగా నివారించేందుకు బస్టాండును తరలించాలన్న ప్రతిపాదన కొలిక్కి రాలేదు. నగరమంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడంతో వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మున్నేరు శివారు కాలనీలు మురికి కూపంలా మారుతున్నాయి. మున్నేరుకు కరకట్ట నిర్మించాలని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లారుు. వీటికి ఇప్పటివరకు అతీగతీ లేదు. చెరువు బజారులోని కబేళాను తరలించాలని ఆ ప్రాంత వాసులు కొన్నేళ్లుగా మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా నగరంలోని ఎనిమిది రోడ్లను విస్తరించాలని కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఇవి అమలు కాలేదు. కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు తదితర కనీస సౌకర్యాలు కూడా లేవు. ఈ గ్రామాల వైపు ఇప్పటివరకు అధికారులు కన్నెత్తి చూడలేదు. కార్పొరేషన్ పాలకవర్గం లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

స్మార్ట్ సిటీపై ఆశలు..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీ జాబితాలో నగరానికి ఎప్పుడు చోటు దక్కుతుందోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజీవ్ ఆవాస్ యోజన కింద నగరంలోని రామన్నపేట, మల్లెమడుగు ప్రాంతాలలో సుమారు రూ.160 కోట్లతో పేదలకు గృహ నిర్మాణం చేపట్టాల్సుంది. అలసత్వానికి, అవినీతికి అలవాటుపడిన అధికారులను, సిబ్బందిని మార్చకుండా.. నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చినా, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలు కేటారుుంచినా ఏమాత్రం ఫలితం ఉండదనేది జనాభిప్రాయం.

మంత్రి తుమ్మల సమీక్ష పైనే ఆశలు
ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నగర ప్రజలు.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నగర పాలక సంస్థ అధికారులతో నిర్వహించనున్న సమీక్ష సమావేశంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కార్పొరేషన్‌కు పూర్తిస్థాయి అధికారులను నియమించడం, అవినీతి-అలసత్వపు అధికారులపై కొరడా ఝుళిపించడం, అభివృద్ధి పనుల వేగవంతం, ప్రధాన సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయింపు... వీటితోనే నగర పాలన గాడిలో పడుతుందని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

>
మరిన్ని వార్తలు