రేపటి వరకు ఇంజనీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు

4 Jun, 2018 01:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా 58,732 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌కు 1,36,305 విద్యార్థులు హాజరు కాగా.. అందులో 1,06,646 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

వారిలో ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న విద్యార్థులకు గత నెల 28 నుంచి వెరిఫికేషన్‌ను ప్రవేశాల క్యాంపు నిర్వహించింది. ఆ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ వెరిఫికేషన్‌కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు 55,354 మంది, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని వారు 1,807 మంది, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని వారు 1,157 మంది, ఇతర రాష్ట్రాల వారు 414 మంది హాజరైనట్లు ప్రవేశాల క్యాంపు కార్యాలయం అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.

అందులో 36,163 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. మిగతా విద్యార్థులు ఈ నెల ఐదు లోగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. సీట్ల కేటాయింపును ఈ నెల 8న ప్రకటిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు