టేకులపల్లి : సమగ్ర కుటుంబ సర్వే చేయాల్సి ఎన్యూమరేటర్ మద్యం మత్తులో విధులకు డుమ్మా కొట్టిన సంఘటన టేకులపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సంపత్నగర్లో పని చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడికి 13వ బ్లాక్ బద్దుతండాలో ఎన్యూమరేటర్గా విధులు కేటాయించారు.
సోమవారం రాత్రి అతను మిగిలిన వారితో కలిసి సర్వే సామగ్రిని సరి చూసుకున్నాడు. సంబంధిత పత్రాలు, బుక్లెట్ తీసుకున్నారు. కానీ అతను స్వగ్రామానికి వెళ్లకుండా బోడురోడ్డు సెంటర్లో ఉన్న పాత హీరోహోండా షోరూం వద్ద మద్యం తాగి రోడ్డు పక్కనే పడుకున్నాడు. మంగళవారం ఉదయం 6 గంటలకు సామగ్రి పంపిణీ కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా అతను వెళ్లలేదు. తిరిగి మద్యం తాగి అక్కడే పడుకున్నాడు. ఉదయం 7.30 నిమిషాల వరకు కూడా కేంద్రానికి వెళ్లలేదు.
స్థానికులు అతనిని గమనించి అధికారులు సమాచారం అందించారు. దీంతో అతని స్థానంలో వెంటనే శకుంతల అనే వైద్యశాఖ ఉద్యోగిని ఎన్యూమరేటర్గా పంపించారు. ఈ విషయమై తహశీల్దార్ రమాదేవి వివరణ కోరగా ఉపాధ్యాయుడు కేంద్రానికి రాలేదని, రిపోర్టు కూడా చేయలేదని అన్నారు. అయితే ఆ వ్యక్తి మంగళవారం రాత్రి కూడా రోడ్డు పక్కనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు.