నో ప్లాస్టిక్‌.. సేవ్‌ ఎన్విరాన్‌మెంట్‌

6 Jun, 2019 11:14 IST|Sakshi
బెలూన్లను గాలిలోకి వదిలి ర్యాలీని ప్రారంభిస్తున్న అధికారులు

జీడిమెట్ల:  భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతను తగ్గించాలంటే మొక్కలను నాటడమే మార్గమని జీడిమెట్ల ఐలా మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జేఎన్‌ఎమ్‌ఐఏ సర్వీస్‌ సొసైటీ, టీఎస్‌ఐఐసీ, ఐలా ఆధ్వర్యంలో 500మందితో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి పీసీబీ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌ కుమార్‌ పాఠక్, జీడిమెట్ల ట్రాఫిక్‌ సీఐ సత్యనారాయణ, టీఎస్‌ఐఐసీ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌ విజయరెడ్డి, ఐలా చైర్మన్‌ సదాశివరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచడంతో పాటు ప్రస్తుతం ఉన్న చెట్లను నరికివేయవద్దని అన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి భూమిని కాపాడుకోవాలని అన్నారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఖచ్చితంగా ట్రీట్‌మెంట్‌ చేసిన తర్వాతనే డిశ్చార్జ్‌ చేయాలని వారు సూచించారు.

కలిసికట్టుగా కార్యక్రమాలు భేష్‌ 
ప్రతి సంవత్సరం జీడిమెట్లలోని అన్ని సొసైటీలు కలిసికట్టుగా నెలరోజుల పాటు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడం భేష్‌ అని మేడ్చల్‌ జిల్లా ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ కుమార్‌ పాఠక్‌ అన్నారు. ప్రతి సంవత్సరం మొక్కలను నాటి వాటిని పెంచడంలో తీసుకుంటున్న జాగ్రత్తలు బాగున్నాయని ఈ సందర్భంగా ఆయన వారిని కొనియాడారు. కార్యక్రమంలో ఐలా కార్యవర్గ సెక్రటరీ సాయికిషోర్, ఎ.ఎల్‌.ఎన్‌.రెడ్డి, ఫేజ్‌–3 ప్రోగ్రాం ఇంచార్జ్‌ విజయ కుమార్‌ నంగానగర్‌ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు