ఏడాదికి లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం

29 Aug, 2019 11:20 IST|Sakshi
పరకాలలో జరిగిన జాబ్‌మేళాలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

ప్రైవేట్‌ రంగం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు

పరకాలలో మెగా జాబ్‌మేళా విజయవంతం 

సాక్షి, పరకాల: ఏటా ప్రైవేట్‌ రంగంలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకు మెగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పరకాలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో బుధవారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు.

పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నుంచి వేలాది మంది నిరుద్యోగులు ఈ మేళాకు తరలివచ్చారు. జాబ్‌ మేళాకు ముఖ్య అతిథిగా మంత్రి దయాకర్‌రావు హాజరుకాగా, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, డీఆర్‌డీఓ సంపత్‌రావు, ఏపీడీ పరమేశ్వర్, వీహబ్‌ చైర్మన్‌ శకుంతల పాల్గొన్నారు. ఈ మేళాను మంత్రి  దయాకర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

కష్టపడే తత్వం ఎక్కువ
గ్రామీణ యువతకు కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. ఈ మేరకు నిరుద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా అర్హత తగిన రంగంలో స్థిరపడాలని సూచించారు. అలాంటి వారి కోసం నియోజకవర్గ కేంద్రాల్లోనే జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ నేటి యువత సెల్‌ఫోన్‌ మోజులో పడి విలువైన సమయం, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి మాట్లాడుతూ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ ఎల్‌.కిషన్, ఇన్‌చార్జి ఏసీపీ సునీతా మోహన్, ఎంపీపీలు టి.స్వర్ణలత, జెడ్పీటీసీ సభ్యులు సిలువేరు మొగిలి, కోడెపాక సుమలత, సుదర్శన్‌రెడ్డితో పాటు బొల్లె భిక్షపతి, బొచ్చు వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

1,632 మందికి ఉద్యోగనియామక పత్రాలు
పరకాలలో నిర్వహించిన జాబ్‌మేళాకు 4,761 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,632 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయగా మరో 873 మందిని శిక్షణకు ఎంపిక చేసినట్లు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. కాగా, జాబ్‌మేళాకు నిరుద్యోగ యువతీ, యువకులతు వారి కుటుంబ సభ్యులతో హాజరుకావడంతో కళాశాల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 55 కంపెనీల బాధ్యలు హాజరై నిరుద్యోగులను అర్హత తగిన ఉద్యోగాలకు ఎంపిక చేశారు. 

మరిన్ని వార్తలు