మిషన్‌ భగీరథలో సగం ఖర్చు కేంద్రం భరించాలి

27 Aug, 2019 02:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘మిషన్‌ భగీరథ’కు అయ్యే ఖర్చు లో 50 శాతం భరించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కోరింది. కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ ఢిల్లీలో ‘జల్‌ జీవన్‌ మిషన్‌’పథకంపై అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. తెలంగాణ తరపున రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన జల్‌జీవన్‌ మిషన్‌పై అన్ని రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. భగీరథలో 50 శాతం నిధులను కేంద్రం భరించాలని మరోసారి కోరాం’అని వివరించారు. అనంతరం షెకావత్‌కు ఎర్రబెల్లి, టీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా, బండ ప్రకాష్‌ వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలను వేగవంతం చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను  కోరారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ ఆసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, దానిపై కసరత్తు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు